ఆయనకే బీజేపీ తెలంగాణ పగ్గాలు.. నేడు హింట్ ఇవ్వబోతున్న అమిత్ షా!

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-29 02:03:02  IST  )

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్టేట్ చీఫ్ ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ పార్టీ ప్రకటించింది.

ఆయనకే బీజేపీ తెలంగాణ పగ్గాలు.. నేడు హింట్ ఇవ్వబోతున్న అమిత్ షా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్టేట్ చీఫ్ ఎన్నిక షెడ్యూల్‌ను జాతీయ పార్టీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆదివారం ఎన్నికల రిటర్నింగ్​అధికారి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు​స్వీకరిస్తారు. మంగళవారం కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు. బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్​పాటిల్​శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభ కర్లందాజే సైతం ఆదివారం రాత్రి ఇక్కడికి రానున్నారు. సోమవారం రోజున శోభ కర్లందాజే నామినేషన్లు​స్వీకరిస్తారు. జులై 1న రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం ఒకరి పేరును ప్రకటించి వారిని నామినేషన్​వేయాలని సూచిస్తుంది. ఆయన పేరును ఎక్కడా అధికారికంగా ప్రకటించరు. అంతర్గతంగా మాత్రమే వ్యవహారాలు సాగుతాయి.

ఓటర్ల జాబితా విడుదల చేయనున్న యెండల

అధ్యక్షుడి ఎన్నికలో భాగంగా అర్హులైన ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్​అధికారి యెండల లక్ష్మీనారాయణ విడుదల చేస్తారు. ఎన్నికకు అవసరమైతే వీరు సైతం ఓటు వేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకరు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికతో పాటు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఒకరిని జాతీయ కౌన్సిల్​సభ్యులుగా ఎన్నుకుంటారు.

బీసీలకు అధ్యక్ష పీఠం!

రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని భావించిన బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే అధ్యక్షుడిగా ప్రకటించే చాన్స్ ఉందని తెలుస్తున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్​ప్రధాన పోటీదారులు ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మరో బీసీ నేతలుగా ఉన్న ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాయల్​శంకర్​పేర్లు సైతం ప్రముఖ వినిపిస్తున్నాయి. మహిళకు చాన్స్​ఇవ్వాలనుకుంటే ఎంపీ డీకే అరుణ పేరు వినిపిస్తున్నది.

నేడు రాష్ట్రానికి అమిత్​షా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం హెలికాఫ్టర్‌లో నిజామాబాద్​వెళ్తారు. అక్కడ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మాజీ మంత్రి డి.శ్రీనివాస్​విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి హెలికాఫ్టర్‌ ద్వారా హైదరాబాద్​చేరుకుంటారు. బేగంపేట ఎయిర్ పోర్టులో పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారని సమాచారం. అక్కడే పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై ఆరాతీస్తారు.

Next Story