కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన.. కుటుంబ సభ్యులు అవి ఇచ్చి పంపారంటూ సెటైర్!

by Disha Web Desk 19 |
కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వినూత్న నిరసన.. కుటుంబ సభ్యులు అవి ఇచ్చి పంపారంటూ సెటైర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానల కారణంగా హైదరాబాద్ మహానగరం జలమయమైంది. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దవడంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని బీజేపీ కార్పొరేటర్లు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరుగుతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్‌కు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి లైఫ్ జాకెట్‌తో హాజరయ్యారు. జీహెచ్ఎంసీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం వర్షం కారణంగా ప్రజలకు ఎదురవుతున్న సవాళ్లను నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మాట్లాడుతూ.. చిన్న వర్షానికే హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోందని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, అందుకే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌కు వెళ్తున్న తనకు తన కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని లైఫ్ జాకెట్, స్విమ్ సూట్ ఇచ్చి పంపించారని తెలిపింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇకనైనా మొద్దు నిద్ర వదిలి హైదరాబాద్ లోని పెండింగ్ నాలా పనులు, డ్రైనేజీ వ్యవస్థ తక్షణమే సరిదిద్ది ప్రజలకు రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి లైఫ్ జాకెట్, స్విమ్ సూట్ ఇవ్వాల్సి వస్తుందన్నారు.

జీహెచ్ఎంసీ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతోందని, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని, మరి కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోతోందని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇటీవల మ్యాన్ హోల్‌లో పడి ఒక చిన్నారి మృతిచెందిన అంశంపై జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్ ఫెయిలయ్యారని, మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా నాలాలను తవ్వి వాటిని పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు జలమండలి ఎదుట ఆందోళన చేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed