‘Razakar Files’తో బీజేపీ లాభం పొందే ప్రయత్నం: దాసోజు శ్రవణ్

by Disha Web Desk 12 |
‘Razakar Files’తో బీజేపీ లాభం పొందే ప్రయత్నం: దాసోజు శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ‌కి విధి విధానం ఉందా..? ప్రజలను అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందా..?.. 10 ఏళ్లు కేంద్రంలో ఉన్నా ఏం చేశామనేది ఉందా..?.. ఏమీ లేకుండా..ఏం చేయకుండా.. రజాకార్ల ఫైల్స్ సినిమా తీసి ప్రజల మధ్య మత విభేదాలు సృష్టించి, చిల్లర రాజకీయాలు చేసి లాభం పొందే ప్రయత్నాన్ని కిషన్ రెడ్డి టీం చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ కోరారు. తెలంగాణ భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ, గిరిజనులకు పోడు పట్టాలు, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని సీఎం‌కు కిషన్ రెడ్డి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఎయిర్ పోర్ట్ నుండి కిషన్ రెడ్డి బయటకు రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన అంటూ డ్రామా మొదలుపెట్టాడన్నారు.

గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లు కిషన్ రెడ్డి తీరు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ మత ధోరణితో మణిపూర్ తగలబడిపోతుందని కేంద్రమంత్రిగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పీఎం మోడీ సైతం మౌనం వీడాలని డిమాండ్ చేశారు. మతం ముసుగులో మారణహోమం సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ దారుణాలు జరుగుతుంటే ఏమి సంబంధం లేనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించడం దారుణం అన్నారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి సంబురాలు చేసుకుంటున్నాడని, వెంటనే కేసీఆర్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని సూచించారు.

31 రాష్ట్రాలకు ఓ నీతి ఏంటి..? తెలంగాణ కు ఓ నీతా? అని ప్రశ్నించారు. తెలంగాణ పై సవతి తల్లి ప్రేమను మోడీ , కిషన్ రెడ్డి ఎందుకు చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి 2021 వరకు తెలంగాణ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏ మొహం పెట్టుకొని డబుల్ బెడ్ రూమ్ దగ్గరికి వెళ్తావు అని కిషన్ రెడ్డి ని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. బుల్డోజర్ బెదిరింపులు మానుకోవాలని, ఎవరి ఇల్లు కూల్చేస్తావ్ ..దమ్ముంటే కూల్చు చూస్తామని, అసలు రాజ్యాగం మీద గౌరవముందా? అన్నారు.

ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్ ను.. మీ పక్కన కూర్చుపెట్టుకొని తెలంగాణ ను అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని .. తప్పుడు ఆరోపణలతో కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని కిషన్ రెడ్డికి శ్రవణ్ సూచించారు. ధాన్యం ఎగుమతులను ఎఫ్‌సీఐ ఎలా నిలివేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి వ్యతిరేక చర్యలను మానుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు చలపతి రావు, రాజారామ్ యాదవ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed