బిట్స్ పిలానీ.. పల్లీ బఠానీ రచ్చ! నాశనం చేశారు కదరా! రిటైర్డ్ ఐఏఎస్ సంచలన ట్వీట్

by Ramesh N |
బిట్స్ పిలానీ.. పల్లీ బఠానీ రచ్చ! నాశనం చేశారు కదరా! రిటైర్డ్ ఐఏఎస్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ తరఫున చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ పార్టీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన పోటీలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇటు బిట్స్ పిలాని, అటు పల్లి బఠానీ.. ఏది కావాలో మీరు ఆలోచించుకోండి.. అని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విమర్శించారు.

ఈ వ్యాఖ్యలను తాజాగా ట్విట్టర్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఖండించారు. అంటే నీకు మన ఉస్మానియా, మన జేఎన్‌టీయూ, మన కాకతీయ యూనివర్సిటీలు పల్లీ బఠానీల లాగా కనపడుతున్నాయా? అని ప్రశ్నించారు. ‘మన యూనివర్సిటీలను అన్నింటిని పల్లీ బఠాణీలను చేసింది నువ్వు నీ తండ్రి కదా. ఫైనల్ గా ఒప్పుకున్నారు మన యూనివర్సిటీలను ధ్వంసం చేశారని. మన విద్యా వ్యవస్థను ధ్వంసం చేశారని.. ఒక తరంని నాశనం చేశారు కదరా! మిమ్మల్ని ఎప్పటికీ తెలంగాణ సమాజం క్షమించదు. అస్సలు బిట్స్ పిలానీ నుండి సొక్కమ్ అని గారంటీ ఇస్తావా? ఈ దేశంలో చదువుకి క్యారెక్టర్ కి సంబంధమే లేదు. 80 వేల పుస్తకాలు చదివిన మహానుభావుని దరిద్రపు పరిపాలనను చూసినం’ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా ఉస్మానియాలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉస్మానియాలో చదువుకున్న విద్యార్థులను పల్లీ బఠానీలు అమ్ముకునే వాళ్ళని కేటీఆర్ హేళన చేసి మాట్లాడారని ఉస్మానియా విద్యార్థులు మండిపడ్డారు. అనంతరం నిరుద్యోగ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో మాస్టర్స్ చేశారు. భువనగిరి జిల్లాకు చెందిన మల్లన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్, జేఎన్టీయూ నుండి ఎంబీఏ పూర్తిచేసాడు.

Next Story