కవిత విషయంలో కేసీఆర్ కు బిగ్ టాస్క్

by Disha Web Desk 13 |
కవిత విషయంలో కేసీఆర్ కు బిగ్ టాస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో జోరుగా చర్చ జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లకే ఎక్కువ సీట్లు ఇచ్చి నష్టపోయామని అంచనాలతో ఈసారి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఈక్రమంలో కల్వకుంట్ల కవిత పోటీచేయబోయే స్థానంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమె ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయబోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ కవిత స్థాన చలనం చేస్తే నిజామాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని పలువురు బీఆర్ఎస్ నేతలు అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో గులాబీ పార్టీలో నిజామాబాద్ లోక్ సభ సీటు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది.

కూతురు విషయంలో కేసీఆర్ కు ఛాలెంజ్:

అధికారంలో ఉన్నన్నాళ్లు కేసీఆర్ ను నిత్యం వెంటాడిన ఆరోపణల్లో కుటుంబ పాలన అనేది ప్రధానమైనది. కుటుంబ సభ్యులకే అన్ని పదవులు ఇచ్చుకున్నారనే విమర్శలు గులాబీ బాస్ పై పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కవిత విషయంలో ఈసారి కేసీఆర్ కు బిగ్ ఛాలెంజ్ గా మారబోతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2019లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో కవిత ఓటమి పాలుకావడంతో ఆ పరిణామం కేసీఆర్ కు మైనస్ గా మారిందని వాదన ఉంది. అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కవితను యాక్టీవ్ పాలిటిక్స్ లో ఉండేలా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రస్తావనకు రావడం తీవ్ర దుమారంగా మారింది. ఈ వ్యవహారం కవిత పొలిటికల్ కెరీర్ కు మాత్రమే కాకుండా కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో కవిత ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఏంటి అనేదానిపై గులాబీ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె పోటీకి దూరంగా ఉంటారని కొందరు, మరో స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తంగా కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహాం అమలుచేస్తారనేది ఆసక్తిగా మారింది.

బీఆర్ఎస్ కు కవిత టెన్షన్:

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు సార్వత్రిక ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఫలితాల్లో ఎదురు దెబ్బ తగలగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటి పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో మరోసారి కల్వకుంట్ల కవిత టాపిక్ చర్చనీయాశం అవుతున్నది. నిజాబాద్ ను కాదని కవిత మెదక్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ప్రత్యర్థి పార్టీలు ఎటాక్ ప్రారంభించాయి. దీంతో పాటు ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను బీజేపీ తెరపైకి తీసుకువస్తే దాని ప్రభావం ఓటర్లపై ఎలా ఉండబోతున్నది అనేది బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెట్టిస్తోందట. దీంతో కవిత అంశం బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆందోళన కలిగిస్తోందనే చర్చ తెరమీదకు వస్తోంది.


Next Story