Big News: ఆశావహులకు తీపికబురు.. ఈ నెలలోనే మున్సి‘పోల్స్’ షెడ్యూల్.!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఇక మున్సిపల్ ​ఎలక్షన్స్‌కు రంగం సిద్దమైంది.

Big News: ఆశావహులకు తీపికబురు.. ఈ నెలలోనే మున్సి‘పోల్స్’ షెడ్యూల్.!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఇక మున్సిపల్ ​ఎలక్షన్స్‌కు రంగం సిద్దమైంది. సంక్రాంతి తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్​విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘం కసరత్తు వేగం చేసింది. మున్సిపల్​ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. గతంలో మున్సిపాలిటీ​ఎలక్షన్స్‌కు ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఉండటంతో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం చేయాలని సీఎం రేవంత్​రెడ్డి నిర్ణయించారు. దీనిలో భాగంగా పాలమూరు జిల్లా నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా జడ్చర్లలో ప్రచారం ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారు. అలాగే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు, ఏడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించనున్నారని సమాచారం. ఇందుకోసం ప్రాథమిక కసరత్తు కూడా ప్రారంభించారు. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్​పార్టీ సీరియస్‌గా తీసుకోవడంతో పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలర్ట్​అయ్యారు. ఇప్పటికే సర్పంచ్​ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడం, పోటాపోటిగా సీట్లు రావడం ఇలాంటి ఎమ్మెల్యేలందరు తమ నియోజకవర్గంలోని మున్సిపాలిటి ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపిక, ఏ సామాజిక వర్గానికి రిజర్వ్​ అయితే ఎవరు బలమైన అభ్యర్థి అవుతారు.. వాటిల్లో లెక్కలు వేస్తున్నారు. సర్పంచ్​ఎన్నికలు పార్టీ గుర్తుపై కాకుండా ఇండిపెండెంట్‌గా జరగడంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా.. మున్సిపల్​ ఎన్నికల్లో అలాంటి అస్కారం లేదు. దీంతో ఎలాగైనా అత్యధిక వార్డులను గెలవాలని లక్ష్యంగా పెట్టుకొని అధికార కాంగ్రెస్​ పార్టీ, ఎమ్మెల్యేలు లక్ష్యంగా పెట్టుకున్నారు. సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు జరిగే మున్సిపాలిటిల్లో రెండింటిలోనూ తక్కువ సీట్లు వస్తే ఎమ్మెల్యేలపై మరింత కఠినంగా వ్యవహరించాలని, రాబోయే ఎన్నికల్లో వారికి ఎమ్మెల్యే టిక్కెట్టు కట్ చేయడంపై ఈ ఎన్నికల ద్వారా కొంత వరకు ఒక అంచనాకు రావచ్చని విశ్లేషిస్తున్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండింటిలోనూ విజయం సాధించలేకపోయారు కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం గురించి ఆలోచించాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. పట్టణ ప్రాంతాల్లో గెలవడానికి బీఆర్‌ఎస్​సహా ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. అధికార పార్టీలోకి రావాలని, తాము అన్ని చూసుకుంటామంటూ వారికి భరోసా కల్పిస్తూ పార్టీలో చేర్చుకోవడానికి సిద్దమవుతున్నారు. బీఆర్‌ఎస్​నుంచి చేరికలు ప్రోత్సహించడం ద్వారా ఆ పార్టీని ఖాళీ చేయడం ఆ పార్టీలో మిగిలిన వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని, బలమైన అభ్యర్థులు కాంగ్రెస్​పార్టీ వారే ఉంటే గెలుపు సులువు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 28వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభంకానుంది. నాలుగు రోజుల పాటు జాతర ఉండనుంది. అయితే ఈ జాతరకు ముందే ఎన్నికల షెడ్యూల్​వచ్చే అవకాశం ఉందని, జాతర ఉన్నా.. ముందుకు వెళ్లే చాన్స్ ఉందని కాంగ్రెస్​నాయకులు గుర్తుచేస్తున్నారు. ఈనెల 10వ తేదీ వరకు వార్డుల వారిగా ఓటరు జాబితా ఖరారు కానుంది. ఆ తర్వాత పోలింగ్​కేంద్రాలను ఖరారు చేయడానికి షెడ్యూల్​ విడుదల చేయనున్నారు. ఆలోగానే డెడికేటెడ్​కమిషన్​నివేదిక తెప్పించుకొని కేబినెట్​ఆమోదించనుంది. ఆ తర్వాత మేయర్, చైర్మన్‌ల రిజర్వేషన్‌లను ఖరారు చేస్తారు. జిల్లా కలెక్టర్‌లు వార్డుల రిజర్వేషన్‌లు ఓకే చేసి ఆ జాబితాను ఎన్నికల సంఘానికి అందిస్తారు. అనంతరం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.

ఇంచార్జ్ మంత్రులదే బాధ్యత..

మున్సిపల్​ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడంలో భాగంగా గెలుపు బాధ్యతలను సీఎం రేవంత్‌రెడ్డి ఇన్‌ఛార్జీల మంత్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన మంత్రులతో జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాలని సూచనలు చేశారు. ఎమ్మెల్యేల సమావేశంలో స్పష్టమైన లక్ష్యాలు ఇవ్వనున్నారు. చేరికలు, స్థానికంగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి పనులు, ఇంకా ఏమైనా పెండింగ్​పనులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర వాటి గురించి స్పష్టత ఇవ్వనున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మున్సిపాలిటీల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం పట్టణాల్లో మున్సిపల్​ఎన్నికల హడావుడి మొదలుకానుంది.

త్వరలోనే పీసీసీ సమావేశం..

మున్సిపల్​ఎన్నికల సన్నద్దతలో భాగంగా అసెంబ్లీ సమావేశాల తర్వాత పీసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారు. పీఏసీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో నియోజకవర్గాలు, జిల్లాల వారిగా ఇన్‌ఛార్జీలను నియమించనున్నారు. ఇప్పటికే ఉన్న ఇన్‌ఛార్జీలను కొనసాగించడం, కొందరు యాక్టివ్​లేని వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నారు. జిల్లా, నియోజకవర్గం వారిగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పీసీసీకి చేరవేయనున్నారు. ఎక్కడెక్కడ బలహీనమైన అభ్యర్థులు, బలమైన అభ్యర్థులు ఉన్నారు.. సమన్వయం ఎలా ఉంది.. ప్రచారం తీరు.. ప్రత్యర్థుల పార్టీల సమాచారాన్ని సేకరించనున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం ఆ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాట్లు చేయనున్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. అవసరమైతే స్వయంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం కూడా రంగంలోకి దిగే అవకాశం ఉందని, కానీ మున్సిపల్​ఎన్నికల్లో ఫలితాలు మాత్రం వేరుగా ఉండకూడదనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.

Next Story