తెలంగాణకు ద్రోహం.. కేంద్ర బడ్జెట్‌‌పై కూనంనేని ఫైర్

by Disha Web Desk 4 |
తెలంగాణకు ద్రోహం.. కేంద్ర బడ్జెట్‌‌పై కూనంనేని ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో తెలంగాణకు మొండి చెయ్యి చూపారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. తెలంగాణ విభజన సందర్భంగా పొందుపర్చిన వాటికి నిధులు కేటాయించలేదని అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించలేదని, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ప్రకటించకపోవడంతో తెలంగాణ పట్ల కేంద్రం చిన్నచూపు చూపుతున్నదని వారన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన పంటల మద్దతు ధర గ్యారెంటీ చట్టం, విద్యుత్‌ సవరణ చట్టం 2022 రద్దు, రుణమాఫీ తదితర అంశాలపట్ల ఢిల్లీలో 13 నెలల పాటు ఆందోళన చేసిన రైతులకు తాత్కాలిక ఉపశమనం కల్పించి నేడు బడ్జెట్‌లో వారికి సంబంధించిన కేటాయింపు లేకపోవడం నమ్మించి మోసం చేయడమే అవుతున్నదని కూనంనేని అన్నారు. ఇది ముమ్మాటికి ఎన్నికల బడ్జెట్‌గానే ఉన్నదని వారన్నారు.

వైరుధ్యాల బడ్జెట్‌

ఒకవైపు 2041 వరకు పేదరికం కనపడకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన కేంద్రం తాజా బడ్జెట్‌లో దానికి విరుద్దంగా వ్యవహరించిందని అన్నారు. గతంలో కార్పోరేట్‌ ట్యాక్సీలు భారీగా తగ్గించి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారని అన్నారు. పేద, మధ్యతరగతి ఇచ్చే సబ్సిడీలను భారీగా కోత విధించారని విమర్శించారు. గత బడ్జెట్‌లో ఆహార, ఎరువులు, పెట్రోలియం సబ్సిడీలో 4.13 లక్షల కోట్లు కేటాయించగా వచ్చే బడ్జెట్‌లో 3.70 లక్షల కోట్లు మాత్రమే కేటాయించడమేంటే రూ.43 వేల కోట్లు కోత విధించారని మండిపడ్డారు.

పేదరికం తగ్గించడమంటే ఇదేనా అని నిలదీశారు. రెండేళ్ళ క్రింద ఉపాధి హామీ పథకానికి రూ.90,860 కోట్లు కేటాయించి, వచ్చే రూ. 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. అప్పులు సైతం విపరీతంగా పెరిగాయని, భారతదేశ అప్పులు రూ. 168.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని, గత బడ్జెట్‌ కంటే 16 లక్షల కోట్లు అధికమని అన్నారు. ఒకవైపు ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్భణం, నిరుద్యోగిత రేటు పెరుగుతుంటే అందుకు విరుగుడు చర్యలు కాకుండా సబ్సిడీలపై, ఉపాధి హామీపై కోత విధించడమంటే వైరుధ్యాల బడ్జెట్‌ అన్నారు.

Next Story

Most Viewed