- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనగణనలో బీసీల వివరాలెక్కడ?.. డైరెక్టర్కు బీసీ కమిషన్ చైర్మన్ లేఖ
తెలంగాణలో జరుగుతున్న మొదటి విడత జనగణనలో బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలమ్ (Column) లేకపోవడంపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో జరుగుతున్న మొదటి విడత జనగణనలో బీసీలకు సంబంధించిన ప్రత్యేక కాలమ్ (Column) లేకపోవడంపై రాష్ట్ర బీసీ కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోళీకేరికి బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ గురువారం ఒక ఘాటు లేఖ రాశారు. 2025 ఏప్రిల్ 30న జరిగిన కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో 2027 జనగణనలో బీసీల కుల గణన (Caste Data) సేకరించాలని నిర్ణయించిన విషయాన్ని నిరంజన్ ఈ లేఖలో గుర్తు చేశారు. కేంద్రం అంగీకరించినప్పటికీ, ఏప్రిల్ 26 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన మొదటి విడత జనాభా లెక్కల సేకరణలో బీసీల అంశాన్ని విస్మరించడం బీసీ వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో విడతలోనైనా స్పష్టత ఉండాలి..
ఈ అంశంపై కమిషన్ ప్రశ్నించగా, కేంద్ర ప్రభుత్వం రెండో విడత జనాభా సేకరణలో బీసీ వివరాలను సేకరిస్తుందని ప్రాథమిక వివరణ ఇచ్చారు. అయితే, దీనిపై కేవలం మాటలతో కాకుండా స్పష్టమైన ప్రణాళిక ఉండాలని కమిషన్ డిమాండ్ చేసింది. తెలంగాణలో ఉన్న బీసీ కులాల జాబితాను డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్కు పంపిస్తూ.. రెండో విడతలో ఆయా కులాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తారో సమగ్రంగా వివరించాలని కోరింది. బీసీ కులాల వివరాల సేకరణలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని, క్షేత్రస్థాయిలో డేటా సేకరణ పారదర్శకంగా జరగాలని చైర్మన్ నిరంజన్ కోరారు. ఈ మొత్తం ప్రక్రియపై త్వరలోనే సవివరమైన నివేదికను సమర్పించాలని డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ను బీసీ కమిషన్ ఆదేశించింది. కోట్లాది మంది బీసీల ప్రయోజనాలకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఈ సందర్భంగా కమిషన్ కోరింది.






