కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బతుకమ్మ చీరల వివాదం.. ఆ నేత వ్యాఖ్యలతో ముదురుతున్న గొడవ

by Disha Web Desk 13 |
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య బతుకమ్మ చీరల వివాదం.. ఆ నేత వ్యాఖ్యలతో ముదురుతున్న గొడవ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఏ మాత్రం చాన్స్ దొరికినా ప్రత్యర్థులను చాకిరేవు పెట్టేందుకు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాలో పద్మశాలీలు వర్సెస్ కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. బతుకమ్మ ఆర్డర్లకు సంబంధించిన అంశంతో మొదలైన ఈ వివాదం ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో కేసుల వరకు చేరింది. దీంతో రాబోయో రోజుల్లో ఈ ఇష్యూ పొలిటికల్‌గా ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నది అనేది హాట్ టాపిక్‌గా మారింది.

వివాదమేంటంటే..?

2017లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను మహిళలకు కానుకగా ఇవ్వడం ప్రారంభించింది. ఈ చీరల తయారీ ఆర్డర్‌ను ప్రతి యేటా సిరిసిల్ల చేనేతలకు ఇస్తోంది. తద్వారా నేతన్నలు ఉపాధి పొందారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈసారి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఉంటాయా? ఉండవా? అని నేతన్నలలో సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో క్లిప్పింగ్ తీవ్ర దుమారం రేపుతోంది. ఓ జర్నలిస్టుతో కేకే మహేందర్‌రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ‘ఎవరెవరూ పాపడాలు అమ్ముతున్నారు? ఎవరెవరు నిరోద్ ప్యాకెట్లు అమ్ముతున్నారు? ఆరేళ్లు దొబ్బితిన్నది సరిపోదా?’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కేకే మహేందర్‌రెడ్డిపై పద్మశాలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచారని కేకేపై పద్మశాలీ సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేకే దిష్టిబొమ్మను దహనం చేయగా 16 మంది పద్శశాలీ నేతలపై తాజాగా కేసులు నమోదయ్యాయి. పరస్పరం కేసులతో ఈ ఇష్యూ మరింత జఠిలంగా మారింది.

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్

ప్రస్తుతం ఈ ఇష్యూ రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నది. కేకే ఆడియో క్లిప్పింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఇంత బలుపా? బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని అడిగితే పాపడాలు, నిరోద్‌లు అమ్ముకోమంటారా? అని మండిపడ్డారు. అయితే కేకే స్పందిస్తూ.. పూర్తి ఆడియో క్లిప్పింగ్ కాకుండా కుట్రపూరితంగా ఎడిట్ చేశారని ఆరోపించారు. సిరిసిల్లలో బీఆర్ఎస్‌కు బలంగా ఉన్న వర్గం తమకు దూరం అవుతుందని కొంతమంది కావాలనే కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో బతుకమ్మ చీరల ఆర్డర్ వ్యవహారం క్రమంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా పొలిటికల్ టర్న్ తీసుకుంటోందని, ఇది ఎక్కడకు దారితీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.



Next Story