‘చాలా అద్భుతంగా ఉంది’.. గోల్డెన్ టెంపున్‌ను సందర్శించిన బండి సంజయ్

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) శుక్రవారం సాయంత్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్(Golden Temple)ను దర్శించుకున్నారు.

‘చాలా అద్భుతంగా ఉంది’.. గోల్డెన్ టెంపున్‌ను సందర్శించిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) శుక్రవారం సాయంత్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్(Golden Temple)ను దర్శించుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బండి సంజయ్ నిన్న(గురువారం) శ్రీనగర్‌లో పర్యటించారు. ఆలిండియా జూడో పోటీల ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతి అందజేశారు. ఈరోజు ఉదయం శ్రీనగర్ సమీపంలోని డచ్చిగాం నేషనల్ పార్క్ (Dachigam National Park)ను సందర్శించారు.

కాశ్మీర్‌లోని అద్భుతమైన ప్రకృతి రమణీయ ప్రాంతం డచ్చిగాం నేషనల్ పార్క్. 141 చ.కిమీ ప్రాంతంలో విస్తరించి ఉన్న పార్క్‌ను 1910లో నాటి మహారాజు హరిసింగ్ ఏర్పాటు చేశారు. చుట్టూ పర్వత శ్రేణులు, గలగల పారే సెలయేర్ల సవ్వడుల మధ్య తీరొక్క పూల తోటతో ఈ పార్క్ ఏర్పాటైంది. 1981లో దీనిని అధికారికంగా నేషనల్ పార్క్‌గా ప్రకటించారు. జింకల సంరక్షణకు ప్రధాన కేంద్రమిది. హంగుల్ జింక (Kashmir Stag), హిమాలయన్ నల్ల ఎలుగుబంటి, మస్క్ డీర్, హిమాలయన్ గ్రే లాంగూర్, లెపర్డ్, బార్కింగ్ డీర్, జంగిల్ క్యాట్ వంటి జంతువులు ఈ పార్క్ లో దర్శనమిస్తాయి. ఇంతటి కమనీయమైన నేషనల్ పార్క్‌ను తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నుండి అనేక మంది ప్రధానులు, రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు సందర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవించి ఉన్నంత కాలం ఇక్కడికి వచ్చేవారని స్థానికులు చెబుతున్నారు. పలు బాలీవుడ్ దర్శకులు కాశ్మీర్ అందాలను చూపించే సినిమాలను ఇక్కడ చాలా నిర్మించారని తెలిపారు. ప్రకృతి ప్రేమకులకు స్వర్గధామంగా ఈ పార్క్‌కు పేరుంది. ఇంతటి విశిష్టమైన డచ్చిగాం నేషనల్ పార్కును కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. దాదాపు మూడు గంటలపాటు పార్క్ అంతా కలియ తిరిగారు. పార్క్ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బలగాలు ‘ఆపరేషన్ మహదేవ్’ పెహల్గాం ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రాంతానికి సమీపంలోనే ఈ పార్క్ ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర భద్రతా సిబ్బంది, జమ్మూకాశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అల్పాహారం సేవించారు.

అనంతరం శ్రీనగర్ నుండి అమృత్ సర్ వెళ్లిన బండి సంజయ్ స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. బండి సంజయ్‌కు స్థానిక విమాన్రాశయంలోనే ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, బీజేపీ కార్యాలయంలో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అక్కడి నుండి సాయంత్రం నేరుగా సిక్కు మతస్తుల అత్యంత పవిత్ర స్థలమైన స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. ఆలయ సిబ్బంది కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను వివరించారు. ఆలయ విశిష్టతను తెలియజేశారు. వారితో కలిసి టెంపుల్‌ను దర్శించుకున్న బండి సంజయ్ రాత్రి వేళల్లో బంగారపు కాంతుల్లో మెరుస్తున్న ఆలయం అద్భుత దృశ్యంగా కన్పిస్తోందని పేర్కొన్నారు. రేపు(శనివారం) పంజాబ్‌లో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలను, మారుమూల గ్రామాలను సందర్శించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.

Next Story