తెలంగాణ బీజేపీ నేతలకు బండి సంజయ్ కీలక ఆదేశం

by Disha Web Desk 19 |
తెలంగాణ బీజేపీ నేతలకు బండి సంజయ్ కీలక ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వడగండ్ల వానతో రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి కోలుకోని విధంగా దెబ్బతిన్నారని, తక్షణమే బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకులు, కార్యకర్తలకు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నాయకులంతా నేరుగా పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలని, పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకోవాలన్నారు. బుధవారం వరకు దెబ్బతిన్న పొలాల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆ వివరాలతో నివేదిక రూపొందించి రైతులను ఆదుకోవాలన్నారు. ఈనెల 27వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందిచాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

వరుసగా కురుస్తున్న వడగండ్ల వానలతో రాష్ట్ర రైతాంగంపై కోలుకోని దెబ్బపడిందన్నారు. చేతికొచ్చిన పంట చాలాచోట్ల పూర్తిగా కొట్టుకుపోయిందని, అసలే దోమకాటుతో ఈ ఏడాది రైతులు ఎకరానికి రూ.20 వేల అదనపు పెట్టుబడి పెట్టి పంటను కాపాడుకుంటే.. వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నాశనమవ్వడంతో రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే కౌలు రైతుల బాధ వర్ణణాతీతమన్నారు.

అప్పు తెచ్చి కౌలుకు తీసుకుంటే చేతికొచ్చిన పంట నష్టపోవడంతో అప్పులెలా తీర్చాలని ఆందోళనలో ఉన్నారన్నారు. దీంతో కౌలు పైసలు ఎట్లా కట్టాలో? కుటుంబాన్ని ఎట్లా నెట్టుకురావాలో అర్థంకాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. గత నెల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టపోతే.. ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని బండి ధ్వజమెత్తారు.

ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచి ఉంటే 30 నుంచి 50 శాతం మంది రైతులు పంట నష్టపోయే వారుకాన్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు తెరవడంవల్ల విధిలేక పంట కోతలు లేటుగా ప్రారంభించడంతో వడగండ్ల వానకు మునిగిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని, తక్షణమే పంట నష్టం వివరాలను సేకరించాలన్నారు.

ఇదిలా ఉండగా ఈనెల 30వ తేదీన ప్రధాని మోడీ నిర్వహించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా నేతలకు ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కేంద్రాలను ఏర్పాటుచేసి టీవీ, స్క్రీన్లు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమాలు వీక్షించేలా చూడాలన్నారు. అట్లాగే ఇప్పటి వరకు చేపట్టిన బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాల వివరాలను బుధవారం నాటికి పంపించాలని సంజయ్ ఆదేశించారు.

Also Read..

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం.. బలగం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి



Next Story

Most Viewed