‘కేసీఆర్‌కు సిగ్గుంటే.. కేటీఆర్‌ను మెడలు పట్టి బయటకు గెంటేయాలి’

by Disha Web Desk 2 |
‘కేసీఆర్‌కు సిగ్గుంటే.. కేటీఆర్‌ను మెడలు పట్టి బయటకు గెంటేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుంటిసాకులు చెప్పి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్, 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రధాన కారకుడైన మంత్రి కేటీఆర్‌ను ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. గన్ పార్క్ వద్ద చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు సిగ్గుంటే.. నీతి నిజాయితీ ఉంటే కేటీఆర్‌ను మెడలు పట్టి కేబినెట్ నుండి తొలగించాలన్నారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీ వాస్తవమని, దీనిపై స్పందించాల్సిన సీఎం నోరు మెదపడం లేదని ఆయన ధ్వజమెత్తారు. బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని బండి హెచ్చరించారు. ధరణి పోర్టల్ అక్రమాల్లోనూ కేటీఆర్ హస్తం ఉందని బండి ఆరోపించారు.

లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ల కుటుంబాలు పేపర్ లీకేజీతో అల్లాడుతుంటే.. దొంగ సారా దందా చేసిన లిక్కర్ క్వీన్‌ను కాపాడుకునేందుకు కేబినెట్ అంతా ఢిల్లీ వెళ్తారా? అని ప్రశ్నించారు. మంత్రులకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. నిరుద్యోగుల కంటే కేసీఆర్ బిడ్డే వారికి ముఖ్యమా? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లోనూ అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ బిడ్డ కోసం పేపర్ లీకేజీ చేస్తారా? అని మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి కారణం ఐటీ వైఫల్యమేనని, దీనికి బాధ్యతగా కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఏండ్ల తరబడి సరైన తిండిలేక, వసతి లేక కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ల జీవితాలను ఛిద్రం చేస్తారా? అని బండి ఫైరయ్యారు. టీఎస్ పీఎస్సీ ఎవరిని నమ్మి మోసపోయారో తెలపాలన్నారు.

టీఎస్ పీఎస్సీ చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని బండి డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ యువత, కార్మికులు, ఉద్యోగులందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు ఉద్యమడించకుంటే తీరని నష్టం తప్పదని బండి పేర్కొన్నారు. అనంతరం టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఆయన పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు బండి సంజయ్, నేతలను అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కార్ఖానా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈటల రాజేందర్‌ను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈటల రాజేందర్ మాట్లాడుతుండగానే పోలీసులు మైక్ కట్ చేశారు. టీవీ చానళ్ల కేబుళ్లను సైతం పోలీసులు కట్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు, జేఏసీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కారణంతో ఉస్మానియా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed