శేరిలింగంపల్లి నుండి బరిలోకి ‘‘బండి’’.. BRS అధిష్టానం ఆశీస్సులు కూడా ఆయనకే..?

by Disha Web Desk 19 |
శేరిలింగంపల్లి నుండి బరిలోకి ‘‘బండి’’.. BRS అధిష్టానం ఆశీస్సులు కూడా ఆయనకే..?
X

శేరిలింగంపల్లి నియోజకవర్గ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలెప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. అయితే ఏ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుంది.. అభ్యర్థులెవరనేది మాత్రం అంత తొందరగా తేలేలా కనిపించడం లేదు. ఆయా పార్టీల నుంచి టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భవిష్యత్ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ బీజేపీకి ఎదురుదెబ్బలు తగలడం, ఉన్న మంత్రుల్లో ఏడుగురు ఓడిపోవడాన్ని చూస్తే అక్కడి ప్రజల్లో ఆ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంతుందో అర్థమవుతున్నది. తెలంగాణలో అలాంటి పరిస్థితులు రాకుండా కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి మూడో సారీ అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్నారు.

కొత్తవారికి అవకాశం..

రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో వీక్‌గా ఉన్నామనే వివరాలు తెలుసుకుంటున్న కేసీఆర్ ఆ ప్రాంతం నుంచి కొత్తవారిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి నియోజకవర్గాలపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అధిష్టానమే ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్నది.

ఉదాహరణకు మెదక్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచి, ఓ సారి డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్ రెడ్డి ఉండగానే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ బీఆర్ఎస్ తరఫున బరిలో ఉంటానని ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి పోటీగా కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. అచ్చంపేట, మునుగోడు, ఉప్పల్, రాజేంద్రనగర్ తదితర నియోజకవర్గాల్లో పార్టీ పెద్దలే ముందస్తుగా ప్రత్యామ్నాయ లీడర్లను సిద్ధం చేస్తున్నట్లు బీఆర్ఎస్‌లో చర్చ నడుస్తున్నది.

శేరిలింగంపల్లి నుంచి బరిలో బండి రమేశ్..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను మార్చి కొత్తవారికి అవకాశం కల్పిస్తారన్న టాక్ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో బలంగా వినిపిస్తున్నది. అదే జరిగితే శేరిలింగంపల్లి టికెట్ తనకే వస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ తన సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారని సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పార్టీలో రమేశ్ బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. 2009 ఎన్నికల్లో రమేశ్ ప్రజారాజ్యం పార్టీ తరఫున శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.

మొదటి నుంచీ ఆయనకు శేరిలింగంపల్లి నియోజకవర్గ లీడర్లు, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. మొదట్లో మియాపూర్ వేదికగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రమేశ్ అక్కడి నుంచే తన కార్యకలాపాలు సాగించారు. తర్వాత మియాపూర్ నుంచి తన కార్యాలయాన్ని గచ్చిబౌలికి మార్చారు. ప్రస్తుతం మియాపూర్‌లోనే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని సన్నిహితులతో చెబుతున్నట్టు తెలిసింది. పార్టీలో చేరిన నాటి నుంచి అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తున్న బండి రమేశ్‌కు ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం.

అధిష్టానం ఆశీస్సులు..

సీఎం కేసీఆర్, కేటీఆర్‌లతో సన్నిహితంగా ఉండే బండి రమేశ్‌కు బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరుంది. ఇటీవల టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే తీర్మానాన్ని కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి రమేశ్ ప్రవేశ పెట్టారు. మిగతా నాయకులున్నా పార్టీ అధినేత ఆ అవకాశాన్ని బండి రమేశ్‌కే కల్పించారు. ఇటీవలే నిర్వహించిన పలు సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేలకు లోకల్‌గా అంత అనుకూలంగా లేదన్న రిపోర్టు వచ్చిన నేపథ్యంలో కొత్తవారికి అవకాశం కల్పించే అవకాశం ఉంటే అందులో బండి రమేశ్ పేరు తెరమీదకు వచ్చే ఛాన్స్ ఉన్నది.

శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కూడా కొత్త వారి కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే బండి రమేశ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. మరి భవిష్యత్తులో సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎవరికి దక్కనున్నాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Read More: ‘‘కవితక్క.. మహిళా రిజర్వేషన్ బిల్లు ముచ్చటేమైంది?’’.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం


Next Story

Most Viewed