ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు

by Kema Shiva Kumar |

పొక్సో (POCSO) కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది.

ముగిసిన బండి భగీరథ్ పోలీసు కస్టడీ.. చర్లపల్లి జైలుకు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసులో నిందితుడైన బండి భగీరథ్ (Bandi Bhagirath) పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతించిన గడువు ముగియడంతో, పోలీసులు ఇవాళ ఉదయం ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో, పోలీసులు భగీరథ్‌ను కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు గతంలో కోర్టు నుంచి కస్టడీ అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుంచి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది.

విచారణ సాగిందిలా..

కస్టడీ తొలిరోజు బండి భగీరథ్‌ను చర్లపల్లి జైలు నుంచి నేరుగా మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మొయినాబాద్‌లోని అరణ్య ఫాంహౌస్‌కు తీసుకెళ్లి, ఘటన జరిగిన తీరుపై ‘సీన్ రీకన్‌స్ట్రక్షన్’ చేసి విచారించారు. రెండో రోజు గచ్చబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్‌కు తరలించి విచారణ జరిపారు. ప్రధానంగా బాధితురాలితో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, స్నాప్‌చాట్‌లలో జరిపిన చాటింగ్‌లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను నిందితుడి ముందు ఉంచి ప్రశ్నించారు. ఈ క్రమంలోనే భగీరథ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లితో పాటు ఫామ్‌హౌస్‌కు వెళ్లిన భగీరథ్ స్నేహితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటాతో పాటు బాధితురాలి తల్లి అందించిన కాల్ రికార్డింగ్‌ల గురించి కూడా భగీరథ్ ముందు ప్రస్తావించి, మరికొన్ని కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రికార్డు చేసుకున్నట్లు సమాచారం.

Next Story