అత్యంత అట్టహాసంగా బాలాపూర్ గణేషుడి ఫస్ట్ పూజ

by Disha Web Desk 2 |
అత్యంత అట్టహాసంగా బాలాపూర్ గణేషుడి ఫస్ట్ పూజ
X

దిశ, బడంగ్‌పేట్: వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 42వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం మొదటి పూజలు నిర్వహించారు. ఎంతో విశిష్టత కలిగిన 21 కిలోల బాలాపూర్ గణేషుడి లడ్డూకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 18 ఫీట్ల వినాయక ప్రతిమ చేతిలో పెట్టారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజ


బాలాపూర్ గణేష్ మండపానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ యువనేత కౌశిక్ రెడ్డిలకు ఉత్సవ సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డిలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం లడ్డూను ప్రసాదంగా బహుకరించారు.


ఆకట్టుకుంటున్న భారీ అరుణాచలం ఆకృతి మండపం

ఈ ఏడాది అరుణాచలం దేవస్థానం ఆకృతిలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. వినాయక మండపానికి లోపలికి వెళ్ళడానికి.. బయటికి రావడానికి రెండు వేరే వేరే మార్గలను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా మండపంలో 18 ఫీట్ల ఎత్తులో సహజసిద్ధంగా కూర్చుని ఉన్న స్థితిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వినాయక ప్రతిమ కిరీటం చుట్టురా హనుమంతుడు, గరుత్మంతుడు ప్రతిమలు ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా తీర్చి దిద్దారు. ఒక చేతిలో అభయ హస్తం, మరో చేతిలో పాషం, అంకుశం ధరించి ఉన్నట్టుగా ప్రత్యేకంగా బాలాపూర్ వినాయకుడిని తయారు చేయించారు. తొలిరోజే వేలాది మంది భక్తులు బాలాపూర్ గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. అరుణాచలం అకృతిలో ఏర్పాటు చేసిన గోపురాల ముందు, బాలాపూర్ వినాయకుని ప్రతిమ ముందు భక్తులు ఎంతో ఆసక్తిగా సెల్ఫీలు తీసుకున్నారు.

బాలాపూర్ గణేషుడి తొలిపూజలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలను శంకర్ రెడ్డి, బడంగ్ పేట్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, కార్పొరేటర్‌లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, శోభా ఆనంద్ రెడ్డి, అర్జున్, నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ ఆధ్వరంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.



Next Story

Most Viewed