మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం.. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక గవర్నర్ చేతిలో

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-01 01:59:49  IST  )

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్ర పౌరుడై ఉంటే చాలు.

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం.. ఇక ఎమ్మెల్సీ ఎన్నిక గవర్నర్ చేతిలో
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్ర పౌరుడై ఉంటే చాలు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోగా శాసనసభ్యుడిగా లేదా శాసనమండలి సభ్యుడిగా దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా ఎన్నిక కాకుంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగం చెబుతున్న నిబంధన. ఈ నిబంధన ఆధారంగా గత 30 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఉభయ సభల్లో దేనికీ ఎన్నిక కాకముందే ముగ్గురు మాత్రమే ఇలా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి హరికృష్ణ, నాటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) నుంచి తన్నీరు హరీశ్‌రావు, తాజాగా కాంగ్రెస్ నుంచి మహ్మద్ అజారుద్దీన్ ఉభయసభల్లో సభ్యుడుగా ఎన్నిక కాకుండానే మంత్రిగా ప్రమాణం చేశారు. శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్​ఏప్రిల్​నెలాఖరు కల్లా ఉభయసభల్లో దేనికైనా ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. అయితే అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే గవర్నర్​కోటాలో ఎమ్మెల్సీగా తీర్మానం చేసి గవర్నర్​ఆమోదానికి పంపింది. అయితే గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలపలేదు. గతంలో బీఆర్ఎస్​నేత దాసోజు శ్రవణ్ వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ఆయన నియామకానికి ఆమోదం తెలపాలనే అభిప్రాయంలో గవర్నర్ ఉన్నట్లుగా సమాచారం. దీంతో సుప్రీంకోర్టు తీర్పు కోసం అజారుద్దీన్ ఎదురుచూస్తున్నారు.

బైపోల్‌లో గెలిచి మంత్రిగా కంటిన్యూ

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో అప్పటి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ చేరాలని నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్‌కు చెందిన ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో టి.హరీశ్‌రావు ఒకరు. అయితే అప్పటికి హరీశ్‌రావు ఎమ్మెల్యే కాలేదు. ఎమ్మెల్యే కాకుండానే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్‌ ఎంపీగా వెళ్లడంతో రాజీనామా ద్వారా ఖాళీ అయిన సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో హరీశ్‌రావు పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన మంత్రి పదవిలో కొనసాగారు.

ఉపఎన్నిక ఆలస్యమవడంతో..

1995 ఆగస్టు సంక్షోభం తరువాత సెప్టెంబర్ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటుగా నందమూరి హరికృష్ణ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే అప్పటికి హరికృష్ణ ఎమ్మెల్యే కాదు. ఆయనను ఎమ్మెల్యేగా పోటీ చేయిద్దామనే ఆలోచనలో అప్పుడు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఉపఎన్నిక నిర్వహించడంలో ఆలస్యం చేసింది. దీంతో ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోవడంతో హరికృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Next Story