దారుణం.. మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్

by Disha Web Desk 4 |
దారుణం.. మహిళ గొంతు కోసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్
X

దిశ, జడ్చర్ల : బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తున్న ఓ మహిళను మార్గమధ్యలో ఆటో డ్రైవర్‌తో సహా మరో మహిళ కలిసి గొంతు కోసి నగలను అపహరించిన ఘటన జడ్చర్ల లో కలకలం రేపింది. మద్దూరు మండలం నందిపాడు గ్రామానికి చెందిన రామకృష్ణమ్మ(56) మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి జడ్చర్ల నుండి ఓ ఆటోలో రాత్రి 10 గంటల సమయంలో బయలుదేరింది.

కాగా ఆటోలో రామకృష్ణమ్మతో పాటు ఆటో డ్రైవర్ మరో మహిళ మాత్రమే ఉండడంతో మార్గమధ్యలో బండమీదిపల్లి గ్రామం సమీపంలో అదును చూసి ఆటోను నిలిపివేసి రామకృష్ణమ్మను బెదిరించి గొంతు కోసి ఆపై ఆమె కడుపుపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు నగలను అపహరించి అక్కడ నుండి పరారయ్యారు.

కాగా రోడ్డు సమీపంలో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్న రామకృష్ణమ్మను రాత్రి 11 గంటల సమయంలో గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా జిల్లా ఆసుపత్రికి చేరుకున్న డీఎస్పీ మహేష్, పట్టణ సీఐ రమేష్ బాబు సంబంధిత ఘటనపై బాధితురాలతో జరిగిన ఘటనపై విచారించారు. మహిళపై కత్తితో దాడి చేసి పరారైన ఆటో డ్రైవర్ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అన్వేషిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story