ఎన్నికల వేళ.. మన ఊరు - మన బడిపై సర్కారు హడావిడి

by Disha Web Desk 4 |
ఎన్నికల వేళ.. మన ఊరు - మన బడిపై సర్కారు హడావిడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హఠాత్తుగా మన ఊరు–మన బడిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో కాకుండా ఇప్పుడు హడావుడి చేయడం ఏంటీ అనే చర్చ జరుగుతున్నది. గత ఏడాది కేటాయించిన నిధుల్లో పావు వంతు కూడా ఖర్చు చేయలేదు. కానీ ప్రచార ఆర్భాటం మాత్రం ఎక్కువైందని విమర్శలు వస్తున్నాయి. ఈ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్‌లో దశలవారీగా మౌలిక వసతులు కల్పించేందుకు ప్లాన్ చేశారు.

నిధుల కొరత..

2022–23 బడ్జెట్‌లో మన ఊరు మన బడి స్కీమ్ కోసం రూ. 3,492 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో తొలి విడతలో సుమారు 9 వేల స్కూళ్లలో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి మొత్తం మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటుకు దీటుగా తయారు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు సుమారు 2 వేల స్కూళ్లలో మాత్రమే పనులు జరిగాయని, అవి కూడా పాక్షికంగా మాత్రమే పూర్తయినట్టు విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వివరించారు.

ఎన్నికల వేళ ప్రచార ఆర్భాటం

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. దీంతో మన ఊరు, మనబడి స్కీమ్‌పై ప్రచారానికి తెరలేపింది. ఇందుకోసం సుమారు పది కోట్ల నిధులను ప్రకటనలు, హోర్డింగ్స్‌కు కేటాయించినట్టు అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. చాలాకాలంగా టీచర్ల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టలేదు. ఈ మధ్యే అందుకు సంబంధించి షెడ్యూలు విడుదల చేసింది. అదే సమయంలో ఈ స్కీమ్ కింద భారీ ఎత్తున ప్రచారం చేసుకోవడం వల్ల రాజకీయంగా కలిసి వస్తుందని ఆశలో బీఆర్ఎస్ పార్టీ ఉందనే ప్రచారం జరుగుతున్నది.

అంతా రహస్యం

మన ఊరు–మన బడి స్కీమ్ కింద మొదటి విడుతలో ఎన్ని స్కూల్స్‌ను ఎంపిక చేశారు? ఏ మేరకు పనులు జరిగాయి? అనే అంశాన్ని రహస్యంగా పెట్టారు. డీఈఓ ఆఫీసుల్లో కూడా వాటికి సంబంధించిన వివరాలు లేవు. నేరుగా స్టేట్ ఆఫీసు నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకు రహస్యంగా పెడుతున్నారో ఎవరికీ తెలియదు. అయితే ఈ స్కీమ్ కింద పిలిచిన టెండర్లపై పెద్ద దుమారం రేగడం, కొందరు కోర్టుకు వెళ్లడంతో వాటిని రద్దు చేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో అంత రహస్యంగా పెట్టారని ప్రచారం ఉంది.

Also Read...

నాడు లూప్‌లైన్.. నేడు కీలక బాధ్యతలు



Next Story