కాంగ్రెస్‌లో ‘గులాబీ తుపాన్’.. కేసీఆర్ ఎవరి పక్షమో తేల్చుకోలేని డైలమా!

by Disha Web Desk 2 |
కాంగ్రెస్‌లో ‘గులాబీ తుపాన్’.. కేసీఆర్ ఎవరి పక్షమో తేల్చుకోలేని డైలమా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కాంగ్రెస్​పార్టీలో కొత్త కన్ ఫ్యూజన్ నెలకొన్నది. బీఆర్ఎస్​పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో? తెలియక కాంగ్రెస్​నేతలు మదనపడుతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్​తన యాక్టివిటీస్‌లో వేగం పెంచినా.. తన మద్దతు ఎవరికి ఉంటుందనేది ఇప్పటివరకు కేసీఆర్​క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇటీవల రాహుల్​గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని మాత్రం సీఎం కేసీఆర్​తప్పుబట్టారు. అంతేగాక ‘కాంగ్రెస్‌తో కలవడం తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, పెత్తనం చూపించడానికి మాత్రమే అంగీకరించం’ అంటూ ఎమ్మెల్సీ కవిత గతంలో చేసిన కామెంట్లు కాంగ్రెస్​పార్టీని డైలమాలో పడేశాయి. ముఖ్య లీడర్లతో పాటు కాంగ్రెస్​క్యాడర్​కూడా బీఆర్ఎస్ తమకు మద్దతు ఇస్తుందనే ఆశతో ఉన్నట్లు సమాచారం.

దేశ వ్యాప్తంగా మోడీని ధీటుగా ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్,​కాంగ్రెస్‌తో కలవాల్సిందేనని ఆ పార్టీ నేతలూ చెబుతున్నారు. మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కేసీఆర్.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌తో కలిచే ఛాన్స్​ఉన్నదంటూ పొలిటికల్​వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతోనే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్​చేస్తున్న దీక్షల్లో సీఎం కేసీఆర్‌పై నేతలెవ్వరూ విమర్శలు చేయడం లేదనేది చర్చ. పైగా హైదరాబాద్​పర్యటనకు వచ్చిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్​చవాన్​కూడా కేసీఆర్​మహారాష్ట్ర ఎంట్రీని స్వాగతిస్తున్నామని నొక్కి చెప్పారు. అయితే ఆయన ఎటువైపు ఉంటారనేది? ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ నేతల కన్ ఫ్యూజన్‌కు కారణం అవుతున్నాయి. దీంతో బీఆర్ఎస్​మిత్రపక్షమా? ప్రత్యర్థో తెలియక చాలామంది కాంగ్రెస్​లీడర్లు సీఎం కేసీఆర్ మీద విమర్శలు చేయడం బంద్ పెట్టడం గమనార్హం.

మోడీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలంతా ఏకం కావాలంటూ కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తూనే మోడీ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారు. అయితే, ఈ గ్రూప్‌లో కాంగ్రెస్‌ను జత చేయకపోతే ఇప్పుడున్న అంచనాల ప్రకారం రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీని ఎదుర్కోవడం కష్టమని సీఎం కేసీఆర్‌కూ తెలుసు. దీంతో బీఆర్ఎస్​కాంగ్రెస్‌తో అలయెన్స్ పెట్టుకోవడం మేలని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే, గతకొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్​వ్యవహరిస్తున్న విధానాలు కూడా కాంగ్రెస్​పార్టీకి సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిణాలమన్నీంటిని పరిగణలోకి తీసుకుంటున్న కాంగ్రెస్​నేతలు కేసీఆర్​సర్కార్‌పై మౌనంగా ముందుకు వెళ్లున్నారు.

ఎప్పుడు ఎలా ఉంటారో?

గతంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకొని పలు ఎన్నికల్లోనూ పోటీ చేసింది. దీంతో గతంలో టీఆర్‌ఎస్‌తో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కూ మేలు జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకొని గెలవాలంటే కాంగ్రెస్ మద్దతు కూడా అవసరమే. మరోవైపు బీజేపీ కూడా తన యాక్టివిటీస్‌ను వేగం పెంచింది. రాష్ట్రంలో అధికారం కోసం పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​మద్దతు తీసుకుంటే, దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు మేలు జరుగుతుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్​కలిపేస్తామని గతంలో కేసీఆర్​హామీ ఇచ్చి మాట తప్పడం, కాంగ్రెస్​నేతల వలనే దేశం వెనకబడింది అని సీఎం హోదాలో అసెంబ్లీలోపదే పదే కామెంట్లు చేయడం వంటివి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య లీడర్లను ఆలోచింపజేస్తున్నది. కేసీఆర్​ఎప్పుడు ఎవరి వైపు ఉంటారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంటుందని కాంగ్రెస్​పార్టీలోని ఓ కీలక నేత పేర్కొన్నారు. అయితే, ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలను మాత్రం తు.చ తప్పక అమలు చేయాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.


Next Story