ఆర్ట్స్‌కు కరువైన ఆదరణ.. కాలేజీల భవిష్యత్తుపై ఆందోళన

by Naga Rani Yarlagadda |

ఒకప్పుడు ఆర్ట్స్ గ్రూపులకు ఎంతో డిమాండ్ ఉండేది. క్రమక్రమంగా ఆర్ట్స్‌కు ఆదరణ తగ్గుతూ కామర్స్, సైన్స్ గ్రూపులకు ఆదరణ పెరుగుతూ వస్తోంది.

ఆర్ట్స్‌కు కరువైన ఆదరణ.. కాలేజీల భవిష్యత్తుపై ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు ఆర్ట్స్ గ్రూపులకు ఎంతో డిమాండ్ ఉండేది. క్రమక్రమంగా ఆర్ట్స్‌కు ఆదరణ తగ్గుతూ కామర్స్, సైన్స్ గ్రూపులకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. యూపీఎస్సీ నిర్వహించే కొన్నిపోటీ పరీక్షల్లో మంచి స్కోరు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరుతుంటారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్(సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్) సబ్జెక్టుల్లో చేరేందుకు కూడా ఆర్ట్స్ గ్రూపులు అనుకూలంగా ఉండేవి. అయితే విద్యార్థుల ఆలోచనా ధోరణి, పెరుగుతున్న మార్కెట్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని కోర్సులను ఎంచుకుంటున్నారు.

ఆర్ట్స్‌లో ప్రవేశాలు అంతంతే..

2025-26 విద్యా సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ)లో మొత్తం 85,680 మంది విద్యార్థులు సీట్లు పొందగా, కామర్స్‌లో 35,402, ఫిజికల్ సైన్స్‌లో 20,890, లైఫ్ సైన్సెస్‌లో 16,099, ఆర్ట్స్‌లో 13,128 సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లలో సైన్స్, ఇతర వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఆధునిక ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు కామర్స్, సైన్స్ వంటి గ్రూపులను ఎంచుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ట్స్ గ్రూపుల పట్ల ఆసక్తి తగ్గడం భవిష్యత్తులో ఈ విభాగంలోని కాలేజీలు, కోర్సులపై ప్రభావం చూపవచ్చని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డిగ్రీలో చేరుతున్నది కూడా తక్కువే..

గతేడాది దోస్త్ పరిధిలోని కాలేజీల్లో 3.93 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా, అందులో 1.70 లక్షల సీట్లే భర్తీ అయ్యాయి. దోస్త్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 820 ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలుండగా వాటిలో జీరో ప్రవేశాలున్న కాలేజీలు దాదాపు 64 ఉన్నాయి. ఇందులో 63 ప్రయివేటు కాలేజీలు కాగా, ఒకటి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీ కావడం గమనార్హం. మూడు విడతల ప్రవేశాలు ముగియగా, 1,20,712 మంది ప్రవేశాలు పొందారు. ఇక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 9,176 మంది, నాన్ దోస్త్ కాలేజీల్లో 11,702 మంది మొత్తం 1,41,590 మంది విద్యార్థులు చేరారు.

Next Story