HYD: టాప్ క్లాస్ క్రిమినల్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

by Disha Web Desk 2 |
HYD: టాప్ క్లాస్ క్రిమినల్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఇంటర్ చదివిన దాడి శ్రీనివాస్ సైబర్ నేరాల్లో మాత్రం టాప్ క్లాస్ క్రిమినల్. సూడో పోలీస్ అవతారం ఎత్తి మహిళలను టార్గెట్ చేస్తూ కోట్లు కొల్లగొట్టాడు. దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని వందల సంఖ్యలో నేరాలు చేశాడు. తమ వద్ద నమోదైన కేసులకు సంబంధించి గాలింపు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అతన్ని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో అరెస్ట్ చేశారు. అతని సహచరులు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకెళ్లారు.

డేటా దొంగల నుంచి..

అమాయకుల ఫోన్ నంబర్లతోపాటు వ్యక్తిగత డేటాను తస్కరించే ముఠాల నుంచి శ్రీనివాస్ పెద్ద మొత్తంలో ఫోన్ నంబర్లను కొన్నట్టు పోలీసుల విచారణలో వెళ్లడయ్యింది. వీటిలో మహిళల నంబర్లను వేరు చేసిన శ్రీనివాస్ వారినే టార్గెట్ చేశాడు. తనను తాను పోలీస్ అధికారిని అని చెప్పుకొని మీకు వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్, ఆయుధాలు దొరికాయని బెదర గొట్టేవాడు. మీవి కావని రుజువు చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపమని చెప్పేవాడు. లేకపోతే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని భయపెట్టేవాడు. దాంతో చాలామంది మహిళలు శ్రీనివాస్ అడిగిన వివరాలు ఇచ్చేవారు. ఓటీపీ నంబర్లు కూడా తెలిపేవారు. ఇలా సేకరించిన వివరాలతో ఎనీ డెస్క్ తదితర యాప్‌లను ఉపయోగించుకుని శ్రీనివాస్ వారి అకౌంట్లలో ఉన్న డబ్బు కొల్లగొట్టేవాడు.

దేశవ్యాప్తంగా నెట్ వర్క్...

తాను నేరాలు చెయ్యటమే కాకుండా శ్రీనివాస్ దేశవ్యాప్తంగా ఏజెంట్లను పెట్టుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. వారికి కమీషన్లు ఇచ్చి ఇదే తరహాలో నేరాలు చేయించే వాడని స్పష్టమయింది. ఇలా శ్రీనివాస్ అతని గ్యాంగ్ కలిసి రోజుకు 5 నుంచి 10 కోట్ల రూపాయలను కొల్లగొట్టేవారని తేలింది. ఈ డబ్బును వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించి ఆ తర్వాత క్రిప్టో కరెన్సీగా మార్చేవాడని వెళ్లడయ్యింది. ఈ క్రిప్టో కరెన్సీని చైనా దేశానికి చెందిన ఓ వ్యక్తి అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ చేసినట్టు తేలింది. అరెస్ట్ చేసిన శ్రీనివాస్‌కు చెందిన నలభై బ్యాంక్ ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. వీటిల్లో కోటిన్నర రూపాయలు ఉన్నట్టు తెలిపారు.


Next Story