బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

by Prasad Jukanti |   (  Updated:2026-07-06 11:32:41  IST  )

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పోక్సో కేసులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. బండి భగీరథ్‍కు బెయిల్ మంజూరు చేయవద్దని బాధితురాలి తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. భగీరథ్‍కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేట్ బషీరాబాద్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరు పక్షాల సుదీర్ఘ వాదనలను విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. బాధితురాల తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బండి భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కేసుపై ప్రభావం చూపుతుందని కేసు దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఇంకా ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సి ఉందని బెయిల్‍పై బయటకు వస్తే సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉందన్నారు. బండి భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే ఈ కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని వాదించారు.

పలు మార్లు లైంగిక దాడి:

ఈ విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించారు. నిందితుడిపై బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశామని బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేశాక ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరించామని తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం నిందితుడు స్నేహం పేరుతో పరిచయం చేసుకుని, పలు మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే ఇరువైపుల వాదనలు పూర్తికావడంతో భగీరథ్‍కు బెయిలా జైలా? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.

Next Story