‘డబుల్ ఇండ్లు’ ఇక లేనట్టేనా?

by Disha Web Desk 4 |
‘డబుల్ ఇండ్లు’ ఇక లేనట్టేనా?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రతి సాధారణ వ్యక్తి సొంత ఇల్లు, కూడు, గుడ్డకు లోటు లేకుండా జీవించాలనే ఆశతో బతుకు బండిని నడిపిస్తాడు. ఆ బతుకు బండి నడిపేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఆశిస్తాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రచారానికి పరిమితం చేస్తూ అమలులో జాప్యం చేస్తున్నది. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చింది.

ఈ హామీలు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తే ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై పేదలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి స్థలం కలిగిన కుటుంబాల నిర్మాణానికి అయ్యే రూ.3లక్షల ఖర్చును భరిస్తామని చెబుతూ ప్రచారం చేస్తున్నది. జిల్లాలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్​ఇండ్ల పంపిణీ ఇక కలగానే మిగులిపోతుంది.

నాసిరకం పనులతో..

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన అత్యంత ప్రధానమైన హామీ డబూల్​బెడ్​రూం ఇండ్లు. ఈ ఇండ్ల పంపిణీలో నిర్లక్ష్యం జరగడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ విమర్శలను తొలగించేందుకు పూర్తైన డబుల్ ​బెడ్​రూం ఇండ్లు పంపిణీ చేస్తారా లేదా అనే అనుమానాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6,637 ఇండ్లు మంజూరు కాగా 6,175 ఇండ్లకే టెండర్లు పిలిచారు. పూర్తిస్థాయిలో టెండర్లను పిలవకపోవడం.. నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో డబుల్​ బెడ్​రూం ఇండ్ల నిర్మాణం గందరగోళంగా మారింది.

ఎంతగా ఆశపడిన నిరుపేదల ఇంటి కల కలగానే మారిపోయింది. రంగారెడ్డి జిల్లాలో 2,836 ఇండ్లకు టెండర్లు ఖరారైతే.. కేవలం 2061 ఇండ్లను మాత్రమే నిర్మాణాలు పూర్తి చేశారు. ఈ ఇండ్లు పూర్తై యేండ్లు గడుస్తున్న ఇప్పటికి పంపిణీ చేయకపోవడంతో దుమ్ముతో పాటు నాసిరకం పనులతో కొన్ని ఇండ్లు పెచ్చులూడుతున్నాయి. పూర్తిగా ఆ ఇండ్లన్నీ కంపచెట్లతో కూరుకుపోయాయి. ఈ కలను ఎప్పుడు నిజం చేస్తారో వేచిచూడాల్సిందే.

మంజూరుకు మించి దరఖాస్తులు..

జిల్లాలో డబూల్​బెడ్​రూం ఇండ్ల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య వేలలో ఉంది. ఇప్పటి వరకు 97,623 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గాల వారీగా చూస్తే.. చేవెళ్ల నియోజకవర్గంలో 7,778, కల్వకుర్తిలో 3,038, ఇబ్రహీంపట్నంలో 12,904, మహేశ్వరంలో 11,484, రాజేంద్రనగర్‌లో 58,767, షాద్‌నగర్‌లో 3,652 ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా దరఖాస్తులు స్వీకరిస్తూనే ఉన్నారు. మొదట స్వీకరించిన దరఖాస్తుల జాడలేకపోగా గతేడాది మీ సేవ ద్వారా 9,704 దరఖాస్తులు రాగా వాటిని తహసీల్దారు పరిశీలించారు. 3,400 దరఖాస్తులు అర్హులుగా గుర్తించారు. 6,496 దరఖాస్తులు అనర్హులుగా గుర్తించారు.

తెరపైకి రూ.3 లక్షల పథకం..

ఆశించిన మేరకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు కొత్త ఆలోచన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సొంతంగా స్థలం ఉన్నవారికి రూ.3లక్షలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేయాలని నిర్ణయించింది కానీ.. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఒక్కో నియోజకవర్గానికి 3వేల మందికి ఈ పథకం అమలు చేయాలనుకున్నా.. ఆచరణలో సాధ్యం కాలేదు. సొంతంగా జాగా లేని వారికి 90 గజాలు ఇవ్వాలని భావిస్తుంది. సొంతంగా జాగా ఇచ్చాక లబ్ధిదారుడికి రూ.3 లక్షల పథకం వర్తింప చేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


Next Story

Most Viewed