నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికే చెందాయి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

by Disha Web Desk 1 |
నియామకాలు కేవలం కేసీఆర్ కుటుంబానికే చెందాయి : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఎజెండాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగి అన్యాయానికి గురిచేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ప్రవళిక మృతిపై అయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రవళిక మృతి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగా ఆయన అభివర్ణించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో నియామకాలు నిరుద్యోగుల ఏ మాత్రం చేరలేదని, కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే చెందాయని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం, లీకేజీలు, కోర్టు కేసులు అంటూ ఎంతో మంది నిరుద్యోగుల పెట్టుకున్న ఆశలను నీరు గార్చిందన్నారు. దీంతో నిరుద్యోగులు తమ భవిష్యత్తు లేదనే ఆందోళన వారిని పట్టి పీడిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ఎన్ని ఆశలతో హైదరాబాద్‌కు వచ్చి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని చివరికి పరీక్షా రాద్దామనుకున్న సమయానికే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఉండటంతో, ప్రభుత్వం వైఫల్యం కారణంగా నిరుద్యోగులు ఎంతో కలత చెందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రవళిక మృతదేహాన్ని చూడడానికి స్నేహితులు, నిరుద్యోగులు చూడటానికి కూడా వీలు లేకుండా పోలీసులు నిర్బంధం మధ్య ఆమె మృతదేహాన్ని వరంగల్‌కు తరలించడం ఆయన తప్పుబట్టారు. ప్రవళిక హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రవళిక బతికి ఉంటే మంచి ఉద్యోగం సంపాదించాలని కుటుంబాన్ని పోషించేదని, ఆమె మృతి చెందడం వల్ల ఆ కుటుంబం ఎంత నష్టపోయిందని కాబట్టి ప్రభుత్వం రూ.కోటి నష్ట పరిహారంతో చెల్లించడం పాటు ఆ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నారాయణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Next Story