HYD: వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి

by Disha Web Desk 2 |
HYD: వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు ట్రైన్ పైకి రాళ్లు విసరడంతో C8 కోచ్ భాగం పాక్షికంగా ధ్వంసమైంది. గడిచిన మూడు నెలల్లో ఇటువంటి దాడులు జరగడం ఇది మూడో సారి. ఈ ఘటనతో ఇవాళ వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్ ఆలస్యంగా బయలుదేరింది. విశాఖ నుంచి ఉదయం 5:45 కు సికింద్రాబాద్‌కు బయలు దేరాల్సిన ట్రైన్ 9:45కు స్టార్టయ్యింది. దీంతో ప్రయాణికులను సౌత్ సెంట్రల్ రౌల్వే అలర్ట్ చేసింది. మామూలుగా సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. కానీ ఈరోజు సాయంత్రం 7 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.

దాని పెయిరింగ్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్నందున ఈ ట్రైన్ కూడా లేటుగా బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, ట్రైన్లపై రాళ్ల దాడికి పాల్పడే వారిని గుర్తించి రైల్వే యాక్ట్‌లోని కఠిన సెక్షన్లు పెట్టాలని అధికారులు డిసైడయ్యారు. తాజాగా ట్రైన్‌పై దాడి చేసిన వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారి కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్) తీవ్రంగా గాలిస్తోంది. పగిలిన కోచ్ అద్దం విలువ దాదాపు రూ. లక్ష రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Next Story