జూనియర్ ఎన్టీఆర్‌పై మైండ్ గేమ్.. అమిత్ షాతో భేటీ ఆ సీట్ల కోసమేనా?

by Disha Web Desk 4 |
జూనియర్ ఎన్టీఆర్‌పై మైండ్ గేమ్..  అమిత్ షాతో భేటీ ఆ సీట్ల కోసమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికలపై బీజేపీ సీరియస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. కేసీఆర్ సర్కార్ ను గద్దె దించి తెలంగాణలో కమల వికాసానికి కావాల్సిన అన్ని కసరత్తులు చేస్తోంది. తాజాగా మునుగోడు నియోజకవర్గానికి అమిత్ షా రావడం, రిటర్న్ జర్నీలో జూ.ఎన్టీఆర్ తో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఈ భేటీ వెనుక కారణాలపై రకరాకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీరిద్దరి భేటీ జరిగింది అరగంటే అయినా.. ఆంతర్యం ఏంటనే దానిపై అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత స్కోప్ మిగిల్చింది. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీని అమిత్ షా చూశారని, అందులో నటన నచ్చి జూ. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ అయ్యారని కొంతమంది బీజేపీ నేతలే చెప్పగా.. మరికొంత మంది ఓ అడుగు ముందుకు వేసి రాజకీయాలు సైతం ప్రస్తావనకు వచ్చి ఉంటే ఉండవచ్చన్నారు. వారి మధ్య ఏ ముచ్చట ప్రస్తావనకు వచ్చినా.. ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ పై రాజకీయ పార్టీల మధ్య మైండ్ గేమ్ షురూ చేయడం ఆసక్తిని రేపుతోంది.

ఆ సీట్ల కోసమే జూ.ఎన్టీఆర్ తో భేటీనా?

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ పావులు కదుపుతోంది. పార్టీ బలోపేతం కోసం రాజకీయ, సినీ రంగును కలుపుకుంటోంది. పొలిటికల్ కారిడార్ లో ఎఫెక్టివ్ లీడర్స్ పై దృష్టి సారించింది. ఇదే సమయంలో సినీ గ్లామర్ ను జోడించుకోవడం పార్టీకి కలిసి వస్తుందనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి జీహెచ్ఎంసీ సెగ్మెంట్ కీలకం అని ఇటు టీఆర్ఎస్, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ సంగతిని పసిగట్టిన కేసీఆర్.. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుండి గెలుపొందిన ఈ ఏరియాలోని ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. ఏకంగా వారిలో కొందరికి మంత్రి పదవులను సైతం కట్టబెట్టారంటే.. ఈ సెగ్మెంట్ కు ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. ఇటీవల టీపీసీసీ ప్రెసిడెంట్ సైతం జీహెచ్ఎంసీపై ఫోకస్ పెట్టారు. పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం కోసం మూడు జిల్లాలుగా జీహెచ్ఎంసీని విభజించారు. పలువురిని చేర్చుకునేలా ప్రణాళికలు సైతం సిద్దం చేసుకున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర సెటిలర్స్ కీలలకంగా ఉన్న జీహెచ్ఎంసీలో టీడీపీకి సానుభూతి కలిగిన ఓట్ బ్యాంక్ ఉంది. దీన్ని తనవైపు తిప్పుకునేందుకే జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావాల్సి వచ్చిందనేది తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రధానమైన వాదన.

వైసీపీ మైండ్ గేమ్

వీరి భేటీపై వైసీపీ అప్పుడే మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. జూ.ఎన్టీఆర్ కు మంచి మిత్రుడిగా పేరున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని అమిత్ షాతో జూ. ఎన్టీఆర్ భేటీ నమ్మశక్యంగా లేదని చెప్పారు. మోడీ, అమిత్ షాలు రాజకీయ ప్రయోజనం లేకుండా ఎవరిని కలవరని చెబుతూనే.. చంద్రబాబు పని అయిపోందనే రీతిలో కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు బీజేపీతో పని అయిపోందనే వాదనలు తెరపైకి వచ్చాయి. తాజాగా బుధవారం లక్ష్మిపార్వతి ప్రెస్ మీట్ నిర్వహించి సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకువచ్చారు. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, అలాగే టీడీపీని టేక్ ఓవర్ చేయాలని ఆమె కోరారు. జూ.ఎన్టీఆర్ ఒక్కరే టీడీపీకి పునర్ వైభవం తీసుకురాగలని హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి జూ.ఎన్టీఆర్ సినీ కెరీయర్ ఫీక్స్ స్టేజ్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వస్తారా? అనేది ఓ సెక్షన్ ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాంటిది జూ.ఎన్టీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలని వైసీపీ డిమాండ్ చేయడం వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టే మైండ్ గేమ్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ సంగతేంటి?

జూ. ఎన్టీఆర్, అమిత్ షా భేటీ తర్వాత సినీ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే టాక్ ఎప్పటి నుండో ఉంది. ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీ నేత కావడం ఓ సందర్భంలో ప్రభాస్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం ఈ ఊహగానాలకు తావిచ్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకు బీజేపీనే ఫండింగ్ చేస్తోందని ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనూహ్యంగా జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ కావడం ఆసక్తిగా మారింది. అయితే జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు గొడవలు పొడచూపిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు స్టార్స్ ఫ్యాన్స్ ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా కలిసి నడుస్తారా? అనేది ఆసక్తిగా మారింది. సినీ స్టార్స్ పార్టీలో చేరితే ప్రధానంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ను బేస్ చేసుకునే వారికి ప్రాధాన్యత లభిస్తుందనేది ఓ వాదన. అలాంటిది వీరి విషయంలో ఏం జరగనుందనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జూ. ఎన్టీఆర్, అమిత్ షాల భేటీ ఏ తీరం చేరుతుందో అనేది ఎన్నికల నాటికి ఓక్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజంగా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా? లేక పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలుపుతారా? అది కాకుండా టీటీపీని ముందుకు నడిపించేందుకు సిద్దం అవుతారా? అసలేం ఏం జరగనుందనేది తేల్చాల్సింది జూ.ఎన్టీఆరే.

కొడాలి నానిపై కాలేసిన Jr. NTR.. ఫొటో వైరల్.

Next Story