రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎయిర్‌ఫోర్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 02:23:03  IST  )

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎయిర్‌ఫోర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. రామగుండం, కొత్తగూడెంలో ఎయిర్​పోర్టుల​ నిర్మాణం సాధ్యం ఇటీవల ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. వరంగల్​ఎయిర్‌పోర్టుకు అదనంగా మరో రూ.140 కోట్లు అవసరం అవుతాయని అధికారుల నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి.

తెలంగాణలో శంషాబాద్ ఒక్కటే..

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్​ఎయిర్‌పోర్టు ఒక్కటే ఉంది. వరంగల్​ఎయిర్‌పోర్టు​ఎన్‌వోసీ జీఎంఆర్ సంస్థ ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నించి సఫలమైంది. దీంతో ఎయిర్‌పోర్టు​ఆథారిటి ఆఫ్ ఇండియా నిధులు కేటాయించి విమానాశ్రయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఎయిర్‌పోర్టును​ఎయిర్‌ఫోర్స్‌, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వినియోగించుకోనుంది. దీనిపై ఎయిర్‌పోర్టు​ఆథారిటీ ఆఫ్​ఇండియా, ఎయిర్‌ఫోర్స్, పౌరవిమానయాన శాఖ అధికారులతో చర్చించారు. దీనికి కేంద్రం సైతం ఒకే అని చెప్పింది.

1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయం

ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఎయిర్ పోర్టును రాష్ట్రం, ఎయిర్‌ఫోర్స్​సంస్థలు వినియోగించుకుంటాయి. దీని కోసం మరో 1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. మొదటి దశలో 900 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిని తర్వాత సేకరించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ కార్గో సేవలు, భవిష్యత్‌లో రన్‌వే విస్తరణ, హోటల్​నిర్మాణం, ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించేందుకు చిన్నపాటి ఆస్పత్రి సైతం ఏర్పాటు చేయనున్నారు.

రామగుండం, కొత్తగూడెంలో ఏర్పాటుకు నో

రామగుండం, కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా సాధ్యం కాదని ఇటీవలే ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు​ స్థలానికి సమీపంలో కొండలు, గుట్టలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దీంతో అక్కడ విమానాలు దిగడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

రూ.140 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం

వరంగల్​ఎయిర్‌పోర్టుకు భూసేకరణ, రోడ్ల కోసం మరో రూ.140 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. గతంలో భూసేకరణకు రూ.205 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే రైతులు భూములిచ్చేందుకు ముందుకొచ్చినా ఎక్కువ ధర చెల్లించాలని డిమాండ్​చేస్తున్నారు. దీంతో మరో రూ.90 కోట్ల వరకు ఎక్కువ అవసరమని జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీంతో పాటు పలు గ్రామాలకు రోడ్లు కావాలని గ్రామస్తులు డిమాండ్​చేస్తున్నారు. వీటికి మరో రూ.50 కోట్ల వరకు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇలా అదనంగా మరో రూ.140 కోట్లు ఎక్కువ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. త్వరలోనే ఈ నిధులు విడుదల కానున్నట్టు సమాచారం.

Next Story