అనాజ్ పూర్ జంట హత్యల కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

by Disha Web Desk 4 |
అనాజ్ పూర్ జంట హత్యల కేసు : వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల మధ్య మనస్పర్థలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్బుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ లో భార్య లావణ్య, కుమారుడు క్రియాన్ష్(నెలన్నర)ను దారుణంగా హత్య చేసిన కేసులో భర్త ధన్ రాజ్ ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో వైద్య పరీక్షల అనంతరం హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. భార్య లావణ్య, కుమార్తె ఆద్య, కుమారుడు క్రియాన్ష్ బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండరావిరాలలోని తన అత్తగారి ఇంటి నుంచి తీసుకువచ్చాడు. అనాజ్ పూర్ లోని తమ ఇంటికి చేరుకున్న అనంతరం భార్య లావణ్యతో ధన్ రాజ్ గొడవపడ్డాడు. ఆ సమయంలో లావణ్య ధనరాజ్ ను దూషించింది. ఆవేశంలో అసలు కొడుకు క్రియాన్ష్ నీకు పుట్టలేదని నోరు జారింది. దీంతో కోపోద్రిక్తుడైన ధనరాజ్ అవమానం భరించలేకపోయాడు.

ఆవేశం పట్టలేక బీరు సీసాలతో ఆమె ముఖంపై దాడి చేశాడు. ఆమె కిందపడిపోవడంతో గొడ్డలి తీసుకుని క్రూరంగా నరికేశాడు. అనంతరం అక్కడే ఉన్న బాబు క్రియాన్ష్ ను గది బయట ఉన్న నీటి సంపులో పడేసి మూత పెట్టాడు. ఇది గమనించిన రెండేళ పాప ఆద్య అక్కడి నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. ఇద్దరిని చంపిన తర్వాత ధన్ రాజ్ అక్కడి నుంచి బైక్ పై పరారయ్యాడు. అనంతరం బైక్ పై హయత్ నగర్ చేరుకుని అక్కడి స్టేషన్ లో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన భార్య అలా మాట్లాడటాన్ని భరించలేక ఈ ఘోరానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. తన భార్యపై తనకు ఎలాంటి అనుమానం లేదని అతడు విచారణలో తెలిపినట్లు సమాచారం.



Next Story

Most Viewed