సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. ఏబీవీపీ నేతల డిమాండ్

by Disha Web Desk 13 |
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. ఏబీవీపీ నేతల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై సిట్ తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. లీకేజీకి టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ నైతిక బాధ్యత వహించాలన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే సంస్థనే పేపర్ లీకేజీతో రోడ్డున పడిందని ఏబీవీపీ నేతలు ఎద్దేవాచేశారు. బోర్డు అధికారులను బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కమల్ సురేష్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం లేకుంటే ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు.

దున్నపోతుపై వానపడినట్లుగా సీఎం కేసీఆర్ తీరు మారిందని ఆయన విమర్శలు చేశారు. ఇప్పటికైనా లిక్కర్ కేసు నుంచి కవితను కాపాడే పని మానుకుని లీకేజీ అంశంపై దృష్టిపెట్టాలని సీఎంకు సూచించారు. కాగా ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా టీఎస్ పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలనీ ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. టీఎస్ పీఎస్సీ లో పనిచేస్తున్న చిన్న చిన్న ఉద్యోగులు చాలా మంది గ్రూప్-1, 2 పోస్టుల్లో నియామకమయ్యారని, వీటిపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ డిమాండ్ చేశారు. కాగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఏబీవీపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రాజు, హైదరాబాద్ జిల్లా కన్వీనర్లు హరిప్రసాద్, సభావట్ కళ్యాణ్ నాయక్, స్టేట్ గర్ల్స్ కన్వీనర్ సిరివెన్నెల, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయికుమార్, ఉదయ్ ధనరాజ్, పవన్, ఉదయ్ కార్తీక్, విక్రమాదిత్య, ఇబ్రహీం ఉన్నారు. ఓయూలో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వారిలో విజయ్, కడారి సురేష్, నవీన్ యాదవ్, ఎం సూర్యం, ప్రశాంత్, శ్రీను, బండి నరేష్, వెంకట్ నాయక్, ఓయూ జేఏసీ చైర్మన్ శ్రీహరి నాయక్ ఉన్నారు.



Next Story

Most Viewed