అలకబూనిన బీజేపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. ఫోన్ స్విచ్ఛాఫ్?

by Disha Web Desk 2 |
అలకబూనిన బీజేపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. ఫోన్ స్విచ్ఛాఫ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ అలకబూనారు. శాసన సభా పక్ష నేత పదవిని ఆయనకు ఇవ్వరన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కినుకు వహించారు. శాసన సభాపక్ష నేత ఎవరనేదానిపై ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో నారాజ్ అయినట్లు తెలిసింది.

కిషన్ రెడ్డితో భేటీలోనూ రాని క్లారిటీ

తనకు కాకుండా ఇంకెవరికి ఆ అవకాశం ఇస్తారని రాజాసింగ్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయినప్పటికీ శాసనసభా పక్ష నేత ఎవరనే అంశంపై క్లారిటీ రాకపోవడంతో రాజాసింగ్ పార్టీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. భేటీ అనంతరం ఎమ్మెల్యేలంతా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని, అంబేడ్కర్ విగ్రహం, గన్ పార్క్ వద్ద నివాళులర్పించాల్సి ఉండగా రాజాసింగ్ స్టేట్ ఆఫీస్ నుంచి నేరుగా వెళ్లిపోయారు. అసంతృప్తితోనే మొబైల్ సైతం స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది.

కొత్తవారికి ఇవ్వనున్నారా?

రేసులో రాజాసింగ్‌తో పాటు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై సమాలోచనలు చేసిన రాష్ట్ర నాయకత్వం కొత్తవారికి అవకాశం కల్పించాలని భావించడంతోనే నేటికీ క్లారిటీ ఇవ్వలేదని చెబుతున్నారు. అయితే గతం నుంచే రాజాసింగ్, కిషన్ రెడ్డి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే మరొకరికి అవకాశం ఇవ్వనుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.



Next Story