రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్.. నోటిఫికేషన్లతోపాటు ఫ్రీ డిజిటల్ కోచింగ్ : భ‌ట్టి విక్రమార్క

by Ramesh Naini |

ప్రజా ప్రభుత్వం తెలంగాణ‌లో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశ‌గా కృత నిశ్చయంతో ప‌నిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క చెప్పారు.

రూ.110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్.. నోటిఫికేషన్లతోపాటు ఫ్రీ డిజిటల్ కోచింగ్ : భ‌ట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా ప్రభుత్వం తెలంగాణ‌లో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశ‌గా కృత నిశ్చయంతో ప‌నిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క చెప్పారు. లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద రూ.110 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంట‌ర్, నింబోలి అడ్డా వ‌ద్ద రూ.25 కోట్ల అంచ‌నాల‌తో నిర్మించ‌నున్న ఎస్సీ హాస్టల్‌కు స్థల ప‌రిశీల‌న చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ రెండు భ‌వ‌నాల‌కు సంబంధించి ఆర్థిక‌, పాల‌న‌పార‌మైన అనుమ‌తులు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. ఈ భ‌వ‌నాలు ​భౌతికంగా కనపడేటు కట్టడాలు మాత్రమే కాదని.. వేలాది మంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాల‌యాల‌ని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణలో నాలెడ్జ్ విప్లవానికి నాంది అని అన్నారు. నాలెడ్జ్ సెంటర్‌ను ట్యాంక్‌బండ్ దగ్గర సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మ‌రో 10 అంతస్తులతో నిర్మించ‌నున్నట్లు తెలిపారు. నింబోలి అడ్డా వ‌ద్ద మూడు అంతస్తుల‌తో హాస్టల్ భ‌వ‌నాల నిర్మాణం ద‌ళిత‌, నిరుపేద వ‌ర్గాల చిరకాల వాంఛ అని చెప్పారు. ఈ భ‌వ‌నాల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాద‌న‌లు పంపిన వెంట‌నే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ క్లియరెన్స్ చేసి పంపించడం జరిగిందన్నారు.

నాలెడ్జ్ సెంట‌ర్‌లో​స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్‌లో విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదిక‌లుగా నిలుస్తాయ‌నే ఆశాభ‌వాన్ని వ్యక్తం చేశారు. అలాగే.. ప్రతీ నియోజ‌క‌వ‌ర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు కోచింగ్ కోసం హైద‌రాబాద్ రాకుండా అక్కడే ప్రిపేర‌య్యేలా ఇవి ఉండ‌బోతున్నాయని తెలిపారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ ఇక్కడి నుంచి పాఠాలు చెబుతుంటే.. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఉన్న చోట‌ నుంచే కోచింగ్‌ను పొందేలా ఈ సెంటర్లను ఇంటర్‌లింక్ చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల నోటిఫికేషన్ లతోపాటు ఉచిత డిజిటల్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.110 కోట్లని, ఈ ఏడాదే పనులు వేగంగా జరగడానికి బడ్జెట్‌లోనే రూ.50 కోట్లను కేటాయించామని ప్రకటించారు. కాచిగూడలోని నింబోలిఅడ్డా హాస్టల్‌ను పూర్తిగా ఆధునికీకరణ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ హాస్టల్‌కు బాబు జగ్జీవన్ రామ్ నాలెడ్జ్ సెంటర్‌గా నామకరణం చేస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మణ్‌కుమార్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేశ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story