అడవి బిడ్డల కోసం అల్లూరి పోరాటం వీరోచితం.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-04 11:30:52  IST  )

స్వాతంత్య్ర సంగ్రామంలో అడవి బిడ్డల కోసం అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju) చేసిన పోరాటం వీరోచితమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు.

అడవి బిడ్డల కోసం అల్లూరి పోరాటం వీరోచితం.. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్య్ర సంగ్రామంలో అడవి బిడ్డల కోసం అల్లూరి సీతారామరాజు (Alluri Seetharamaraju) చేసిన పోరాటం వీరోచితమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని శిల్పకళా వేదికలో కేంద్ర ప్రభుత్వం తరఫున అల్లూరి జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma), కేంద్ర మంత్రులు శ్రీనివాస వర్మ, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సభలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. గిరిజనుల కోసం అల్లూరి సీతారామరాజు చాలా పోరాటాలు చేశారని తెలిపారు.

ఎలాంటి ఆయుధాలు లేకుండా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బ్రిటీష్ వారితో భీకరంగా పోరాడారని కొనియాడారు. అడవి బిడ్డల కోసం ఆయన చేసిన వీరోచిత పోరాటం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. అల్లూరి సీతారామరాజు శౌర్యం, వీరత్వం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని భయపడేలా చేసిందని పేర్కొన్నారు. గెరిల్లా వార్ ఫేర్‌తో తెల్లవారిని గడగడలాడించారని, ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న తెల్లవారికి సరైన బుద్ధి చెప్పారని కీర్తించారు. అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామాన్ని పర్యాటక ప్రాతంగా తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. బానిసత్వంతో కాదు.. అత్మాభిమానంతో బతకాలనేది ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు. ప్రజల కోసం అన్నీ త్యాగం చేసి, పోరాటం చేసి గొప్ప వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని పేర్కొన్నారు. ఆదివాసీలను పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని నిర్మూలిస్తామని.. అసలు నక్సలిజమే లేని భారతదేశాన్ని నిర్మిస్తామని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Next Story