డిప్ ద్వారా డబుల్ బెడ్ రూం కేటాయింపు.. ఆ తరువాత అధికారులు ఇచ్చిన షాక్ తో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న లబ్ధిదారుడు..

by Disha Web Desk 11 |
డిప్ ద్వారా డబుల్ బెడ్ రూం కేటాయింపు.. ఆ తరువాత అధికారులు ఇచ్చిన షాక్ తో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న లబ్ధిదారుడు..
X

దిశ, గద్వాల: ఇటీవలే డిప్ ద్వారా కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇంటిని వేరే వ్యక్తికి ఇచ్చారంటూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగుడు శాలిమియా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని 15 వ వార్డుకు చెందిన శాలిమియా ప్రభుత్వం కల్పిస్తున్న డబుల్ బెడ్ రూం ఇంటికి దరఖాస్తు చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం జిల్లా కలెక్టర్, గద్వాల ఆర్డీవో, గద్వాల ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ల సమక్షంలో డిప్ ద్వారా దివ్యాంగులకు డబుల్ బెడ్ రూంలకు ఎంపిక చేశారు.

డిప్ లో 15వ వార్డుకు చెందిన శాలిమియాకు డబుల్ బెడ్ రూం కేటాయించడం జరిగింది. అన్ని ధృవపత్రాలను సమర్పించేందుకు వెళ్లిన శాలిమియాకు అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. తన పేరు మీద డబుల్ బెడ్ రూం లేదని వేరొకరి పేరున ఉందని చెప్పడంతో కంటతడి పెట్టాడు. దీంతో చేసేదేమీ లేక గురువారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు పెట్రోల్ బాటిల్ లాక్కొని అతనిపై నీళ్లు పోశారు.

దీంతో ప్రమాదం తప్పింది. డబుల్ బెడ్ రూం కేటాయించిన తర్వాత కూడా అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే తనతో పాటు తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని బాధితుడు శాలిమియా వాపోయాడు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు స్పందించి శాలిమియాకు కేటాయించిన డబుల్ బెడ్ రూం తనకే ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed