పొత్తు పాలిటిక్స్..! బీఆర్ఎస్‌లో టెన్షన్?

by Disha Web Desk 4 |
పొత్తు పాలిటిక్స్..! బీఆర్ఎస్‌లో టెన్షన్?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే విషయంపై హస్తం పార్టీ నేతలు చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఆ రెండు పార్టీలు దోస్తీ కట్టే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే విషయంపై కాంగ్రెస్ ముఖ్య నేతల సుదీర్ఘమైన చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.

పలుమార్లు కాంగ్రెస్​నేతల్లో కొందరు మీడియా చిట్​చాట్‌లలోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు. అంతేగాక గతంలో విజయవాడ వేదికగా దిగ్విజయ్​సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ ప్రకటించినా.. అనంతరం ఆ పార్టీ​ ముఖ్య నేతలతో పొత్తుపై చర్చించినట్టు తెలిసింది. బీఆర్ఎస్‌తో పొత్తుకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు సైతం సానుకూలంగానే ఉన్నదనే ఇండికేషన్ తమకు అందిందని ఇక్కడి నేతలు గతంలో ప్రచారం చేశారు.

దీనికి తోడు తాజాగా కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి మీడియా సాక్షిగా పొత్తు‌పై అసలు విషయాన్ని బయటకు చెప్పడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్‌లోని ముఖ్య నేతల్లో కొందరు వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కానీ అంతర్గతంగా బీఆర్ఎస్‌తో పొత్తు‌కు కాంగ్రెస్ ​రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. మరో వైపు ఢిల్లీ అధిష్టానం కూడా పొత్తుపై ఓ క్లారిటీ‌తో ఉన్నట్టు కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్య నేతలు చర్చించుకోవడం గమనార్హం.

రెండు పార్టీల ప్రధాన టార్గెట్ బీజేపీ

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ రెండూ సెక్యూలర్​ పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు కలవాలని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు.. ఢిల్లీ అధిష్టానంపై కొన్ని రోజుల నుంచి ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు రావని, హంగ్ ఏర్పడే ఛాన్స్ ఉన్నదని కాంగ్రెస్‌తో పాటు కొందరు బీఆర్‌ఎస్ నేతలు కూడా అంచనా వేస్తున్నారు. ప్రజల్లోని వ్యతిరేకతతో బీఆర్‌ఎస్ ​మ్యాజిక్ ఫిగర్ సీట్లను గెలిచే అవకాశం లేదు.

మరో వైపు కాంగ్రెస్‌లో అందరూ కలసి కట్టుగా పనిచేస్తే గరిష్టంగా 40 నుంచి 50 సీట్లు గెలిచే ఆస్కారం ఉన్నదని ఆ పార్టీ సీనియర్ల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రెండు సెక్యులర్​ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతున్నది. మరోవైపు రెండు పార్టీలకు ప్రధాన టార్గెట్​ బీజేపీనే. ఆ పార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పనిచేస్తున్నాయి. పైగా ఇటీవల సీఎం కేసీఆర్​ కూడా అసెంబ్లీలో బీజేపీపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్‌ను అభినందించడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుపై ఇప్పటికే వారికి ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తున్నది.

బీఆర్ఎస్‌లోనూ భయమే

తెలంగాణలో ముచ్చటగా మూడో సారి గెలుస్తామని ఆ పార్టీ టక్కున చెప్పే పరిస్థితి లేదు. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ, లోలోపల అధికారం కోసం ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పుకొచ్చారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, తెలంగాణ ఆకాంక్షలు సంపూర్ణంగా నెరవేరకపోవడం, ప్రభుత్వ స్కీమ్‌లను సమర్థవంతంగా అమలు చేయకపోవడం, కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఇలా కొన్ని అంశాలు బీఆర్‌ఎస్​పార్టీకి నష్టాన్ని చేకూర్చే చాన్స్ ఉన్నదని ఆ పార్టీ ముఖ్యనేతలే ఆఫ్​ది రికార్డులో అంగీకరిస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీకి మద్దతు ఉండాల్సిన అవసరం ఉన్నదని గులాబీ పార్టీ కీలక నేతలు పలుచోట్ల ప్రస్తావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఎంట్రీ కోసమే చేరికలపై ఫోకస్.. ప్రాతినిధ్యం కోసం బీఆర్ఎస్ పాకులాట

Next Story

Most Viewed