నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఓఎంఆర్ షీట్లు విడుదల: జూలై 15 వరకు ఛాలెంజ్‌కు అవకాశం

by Ramesh Naini |

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)2026 ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్డ్ ఇమేజ్‌లను, రికార్డెడ్ రెస్పాన్స్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఓఎంఆర్ షీట్లు విడుదల: జూలై 15 వరకు ఛాలెంజ్‌కు అవకాశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ)2026 ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్డ్ ఇమేజ్‌లను, రికార్డెడ్ రెస్పాన్స్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. విద్యార్థుల సౌకర్యార్థం వారు రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఈ-మెయిల్ ఐడీలకు కూడా ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీలను పంపినట్లు ఎన్‌టీఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ రికార్డెడ్ రెస్పాన్స్‌లలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని ఆన్‌లైన్ ద్వారా ఛాలెంజ్ చేయడానికి అవకాశం కల్పించారు. సోమవారం (జూలై 13) నుంచి ప్రారంభమైన ఈ ఛాలెంజ్ ప్రక్రియ జూలై 15వ తేదీ ఉదయం 11:00 గంటల వరకు కొనసాగుతుంది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ ద్వారా లాగిన్ అయి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. డేటా భద్రత, గోప్యతను కాపాడటం కోసం ఈసారి టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ) విధానాన్ని ప్రవేశపెట్టారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌కు వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ)ని నమోదు చేస్తేనే ఓఎంఆర్ షీట్ కనిపిస్తుంది. కాగా, కీ ఛాలెంజ్ ప్రక్రియ ఇప్పటికే ముగిసిందని, జవాబులపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది

రూ.200 ప్రాసెసింగ్ ఫీజు.. క్లెయిమ్ నిజమైతే రీఫండ్

అభ్యర్థులు సమర్పించిన భౌతిక ఓఎంఆర్ షీట్‌లో మార్క్ చేసిన జవాబులకు, స్కానింగ్ ఏజెన్సీ రికార్డ్ చేసిన రెస్పాన్స్‌లకు మధ్య వ్యత్యాసాలు ఉంటే.. ప్రతి ప్రశ్నకు రూ.200 వంతున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఆన్‌లైన్ పోర్టల్‌లో అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. స్కానింగ్ యంత్రం పొరపాటుగా రీడ్ చేసిందని తేలి, అభ్యర్థి క్లెయిమ్ నిజమని నిర్ధారణ అయితే ఈ ప్రాసెసింగ్ ఫీజును తిరిగి రీఫండ్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా జూలై 15 ఉదయం 11:00 గంటల లోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రశీదు లేని మరియు ఇతర మార్గాల్లో వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరు.

ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు- ఎన్‌టీఏ హెచ్చరిక

ఓఎంఆర్ రెస్పాన్స్‌లను ఛాలెంజ్ చేసే అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ ఇమేజ్‌ను మార్చడం లేదా ట్యాంపరింగ్ చేసి అభ్యంతరాలు లేవనెత్తితే దానిని అన్‌ఫెయిర్ మీన్స్ (యూఎఫ్ఎం) కింద పరిగణించి, సదరు అభ్యర్థిపై డీబార్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పూర్తిగా బబ్లింగ్ చేసిన వాటిని మాత్రమే చెల్లుబాటు అయ్యే రెస్పాన్స్‌లుగా గుర్తిస్తారు. ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సర్కిల్స్ మార్క్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. అభ్యర్థులు తాజా సమాచారం కోసం www.nta.ac.in, neet.nta.nic.in వెబ్‌సైట్లను సందర్శించాలని, సందేహాల నివృత్తి కోసం 011-40759000 లేదా [email protected] ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలని సూచించారు.

Next Story