నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్‌పై నమ్మకం పోయింది.. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్

by Dishafeatures2 |
నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్‌పై నమ్మకం పోయింది.. ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.తిరుమలై రామన్ అన్నారు. నిరుద్యోగుల పక్షాన సర్కార్ లేదని కేవలం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ ముఖ్య నేతగా హాజరై మాట్లాడుతూ.. యువతకు ఉపాధి హామీ కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వ తీరు అప్ప్రజాస్వామికమన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి నిరుద్యోగుల భవిష్యత్ పై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ లో పరిస్థితులు నెలకొన్నాయని, రిక్రూట్మెంట్ బోర్డ్ పోటీ పరీక్షలను నిష్పక్షపాతంగా నిర్వహించలేక విఫలం అయిందని ఆరోపించారు.

రాష్ట్రంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపర్చలేని ప్రభుత్వ పథకాలు అవసరం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను నిర్మించాలని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు స్పష్టం చేశారు. నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని తిరుమలై రామన్ పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్ లింగం రవి, వెంకటేశ్వర్లు, యుగంధర్, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, సత్యప్రసాద్, ఆర్.బాలకృష్ణ, బిజ్జ శ్రీనివాస్, లక్ష్మణ్, కిషోర్, సల్మాన్, మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story