ఎమ్మెల్సీకి ఎదురుగాలి! అసెంబ్లీ టికెట్‌ డౌటేనా?

by Disha Web Desk 4 |
ఎమ్మెల్సీకి ఎదురుగాలి! అసెంబ్లీ టికెట్‌ డౌటేనా?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తుందని... గెలుస్తామని పలువురు ఎమ్మెల్సీలు ఆశించారు.. తమ అనుచరులతో కలిసి నియోజకవర్గంలో వ్యూహ ప్రతి వ్యూహాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణుల సమావేశాల్లో సైతం ఎమ్మెల్యేగా బరిలో ఉంటామని వెల్లడించారు. అంతేకాదు మరి కొంతమంది అనుచరులకు సైతం పార్టీ టికెట్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే పార్టీ కార్యక్రమాలకు ఇన్‌చార్జిలుగా ఇతర జిల్లాలకు ఎమ్మెల్సీలను నియమించారు. దీంతో ఎన్నికల వరకు ఆయా జిల్లాలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఈ నేపథ్యంలో సొంత అసెంబ్లీ నియోజకవర్గంలోని అనుచరులు, పార్టీ శ్రేణులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ప్రజలతో దూరమైతే తాము ఎక్కడ పట్టుతప్పుతామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా వారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అనేలా ఉంది. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక ఎమ్మెల్సీలకు సైతం ఇతర జిల్లాలకు పార్టీ కార్యక్రమాల ఇన్‌చార్జిలుగా అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇందులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని నాగర్ కర్నూల్‌ జిల్లాకు ఇన్‌చార్జిగా నియమించింది.

తాండూర్ నుంచే పోటీ..

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటన చేశారు. మీడియా ముందు సైతం పేర్కొన్నారు. నియోజకవర్గంలో యాక్టివ్ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈయనతో పాటు చేవెళ్ల నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ కేఎస్ రత్నం, పరిగికి చెందిన మనోహర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్‌కు సైతం టికెట్ ఇప్పిస్తానని పట్నం హామీ ఇచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం.

అయితే మహేందర్ రెడ్డి‌ని నాగర్ కర్నూల్ జిల్లా ఇన్‌చార్జిగా నియమించడంతో ఎన్నికలు అయ్యే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే టికెట్ వస్తుందని ప్రచారం సాగుతోంది. దీంతో మహేందర్‌ రెడ్డిని నమ్ముకున్న నేతలు డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో పట్నం మహేందర్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూలు జిల్లాలోనే మహేందర్ రెడ్డి ఉంటే ఇక్కడ పార్టీ శ్రేణులకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అధిష్టానం మాట కాదనలేక.. సొంత నియోజకవర్గంలో ఉండ లేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతున్నారు.

Next Story

Most Viewed