మళ్లీ గోదావరికి వరదలు... అలా స్నానాలు చేయవద్దని హెచ్చరిక

by Disha Web Desk |
మళ్లీ గోదావరికి వరదలు... అలా స్నానాలు  చేయవద్దని హెచ్చరిక
X

దిశ,దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండల అధికార యంత్రాంగం మళ్లీ అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రవాహం మళ్లీ క్రమంగా పెరుగుతుంది. కొన్ని రోజులుగా నిలకడగా ఉంటూ తగ్గుతూ వచ్చిన వరద పెరుగుతుండటంతో ముంపు గ్రామాల నిర్వాసితుల్లో ఆందోళన నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరి వరద 55 అడుగులు వచ్చే సూచనలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద సాయంత్రం 3:00 గంటలకు గోదావరి వరద 51.90 అడుగులకు చేరుకుంది. దీంతో దుమ్ముగూడెం మండలంలోని ముంపు ప్రాంతాలైన సున్నంబట్టి, కాశినగరం గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. గోదావరి వరద పెరగడంతో మండలంలో పలు చోట్ల రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై వరద నీరు పెరుగుతుండడంతో మండల పోలీసు శాఖ అప్రమత్తమైంది. సీఐ దోమల రమేష్ ఆదేశాల మేరకు ఎస్సై కేశవరావు తన సిబ్బందితో కలిసి తూరుబాక రహదారిపై వాహణాలు వెళ్లకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ... గోదావరి వరద కారణంగా వాగులు, వంకలు పొంగే అవకాశముందన్నారు. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పశువులను బయటకు వదలకుండా ఇంటి పట్టునే ఉంచాలని, జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. గోదావరి నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. నదిలో పడవలపై ప్రయాణించవద్దని.. స్నానాలకు దిగడం, చేపలు పట్టడం చేయరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Next Story

Most Viewed