తెలంగాణ యువతకు ఉపాధి దారులు చూపుతున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు

by Taduka Kalyani |

తెలంగాణ యువతకు ఉపాధి దారులు చూపుతున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు
X

దిశ, కార్వాన్ : ప్రపంచ ఉద్యోగ విపణిలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ యువతను సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటీఐలు) అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) తీర్చిదిద్దిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కేంద్రాలు కేవలం శిక్షణా సంస్థలుగానే కాకుండా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరియు అంతర్జాతీయ కెరీర్‌లకు ద్వారాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం మల్లేపల్లి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మీడియా ప్రతినిధులతో కలిసి సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ట్రైనర్లు ఏటీసీల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఆధునిక యంత్రాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను ప్రదర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) భాగస్వామ్యంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీలు) ఏర్పాటుకు సుమారు రూ.4,000 కోట్ల విలువైన అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, శిక్షణా వనరులను సమకూర్చింది. ఏటీసీల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం స్టైపెండ్లు కూడా అందజేస్తోందని, ఆర్థిక ఇబ్బందులు ఆధునిక నైపుణ్యాల సాధనకు అడ్డంకిగా మారకుండా చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.

*“సువర్ణావకాశం”*

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలకు అనుగుణంగా శిక్షణా సంస్థలను ఆధునీకరించడం ద్వారా భవిష్యత్ పరిశ్రమల అవసరాలను తీర్చగల అత్యున్నత నైపుణ్యాలున్న మానవ వనరులు సిద్ధమవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణ యువత ఉపాధి అవకాశాలను పెంపొందించడమే కాకుండా రాష్ట్రాన్ని దేశంలోనే నైపుణ్యాభివృద్ధి రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని అన్నారు. ఏటీసీలను యువతకు లభించిన *“సువర్ణావకాశం”*గా అభివర్ణించిన మంత్రి, అందుబాటులో ఉన్న సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని చెప్పారు. “ఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణలో భవిష్యత్ ఉపాధి వ్యవస్థకు పునాదులు వేస్తున్నాయి. ఇవి మన యువతను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతున్నాయి” అని మంత్రి పేర్కొన్నారు. ఐటీఐల మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు శిక్షకులు, బోధకులకు కూడా విస్తృత స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నైపుణ్యవంతమైన మానవ వనరులను తీర్చిదిద్దడంలో ఏటీసీలు కీలక పాత్ర పోషిస్తాయని, తెలంగాణను దేశంలో ప్రముఖ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా నిలబెట్టడంలో ఇవి మైలురాయిగా మారతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రత్యేక ఫోటో ప్రదర్శన...

ఈ సందర్భంగా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ప్రత్యేక ఫోటో ప్రదర్శనతో పాటు సాంకేతిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మంత్రి, మీడియా ప్రతినిధులతో తమ అనుభవాలను పంచుకున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌గా రూపాంతరం చెందడం వల్ల తమ నైపుణ్యాలు పెరిగాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, తమ జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని వివరించారు. శాఖ అధికారులు, ట్రైనర్లు, సిబ్బంది కృషిని అభినందించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, యువతకు నాణ్యమైన శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వారు చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు. తెలంగాణ భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు నిర్మించేందుకు ఇదే నిబద్ధతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Next Story