హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ సహకారంతో.. అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం

by Naga Rani Yarlagadda |

HDFC ఏఎంసీ సహకారంతో రామకృష్ణ ఛారిటబుల్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన అంకాలజీ బ్లాక్ కు రాష్ట్రపతి ముర్ము ప్రారంభించారు.

హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ సహకారంతో.. అడ్వాన్స్‌డ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్రిందావన్ (ఉత్తర్ ప్రదేశ్) లోని రామకృష్ణ ఛారిటబుల్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఆంకాలజీ బ్లాక్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రారంభించారు. హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) చొరవలో భాగంగా ఈ బ్లాక్‌లో అత్యాధునిక రేడియోథెరపీ యూనిట్ ఏర్పాటుకు సహకారం అందించింది. హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ అందించిన ఆర్థిక సహకారంతో ఇక్కడ హై-ప్రిసిషన్ రేడియోథెరపీ పరికరాలను అమర్చారు. ఇవి ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలగకుండా, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందిస్తాయి. ఈ సదుపాయం ద్వారా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రోగులకు సేవలు అందిస్తారు. ముఖ్యంగా ఖరీదైన వైద్యం అందుకోలేని పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది.

వైద్యసేవల్లో మైలురాయి..

2017లో ప్రారంభమైన ఈ ఆంకాలజీ విభాగం ఇప్పటివరకు 45,000 మంది అవుట్‌పేషెంట్లకు, 12,000 మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందించింది. నిరుపేద రోగులకు ఇక్కడ ఉచితంగా చికిత్స అందిస్తుండటం విశేషం. కొత్తగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్‌లో రెండు రేడియోథెరపీ బంకర్లు, బ్రాకీథెరపీ బంకర్, సీటీ సిమ్యులేటర్, డే-కేర్ యూనిట్ వంటి అధునాతన వసతులు ఉన్నాయి. ఈ సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ నవనీత్ మునోత్ మాట్లాడుతూ... దేశాభివృద్ధిలో నాణ్యమైన ఆరోగ్య సేవలు కీలకమని, క్యాన్సర్ బాధితుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తమను ప్రోత్సహించినందుకు రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Next Story