ఆదివాసీలు దేశానికి మూలవాసులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఆదివాసీలు దేశానికి మూలవాసులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

ఆదివాసీలు దేశానికి మూలవాసులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదివాసీలు దేశానికి మూలవాసులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మేడారం పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి అమ్మవార్లను దర్శించుకుంటున్నానని తెలిపారు. 2023 ఫిబ్రవరి 6న మేడారం గడ్డ మీద నుంచే పాదయాత్ర మొదలుపెట్టానని పేర్కొన్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని, శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సంప్రదాయానికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మేడారం ప్రజల అభిప్రాయాలు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చామని అన్నారు. సంప్రదాయంలో వీసమెత్తు కూడా తేడా రాకుండా ఉండాలనేదే తమ ప్రభుత్వ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ జన్మకు దక్కిన వరం..

భక్తి డబ్బులతో కొలిచేది కాదని.. నమ్మకంతో కొలిచేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా అభివృద్ధి ఉండాలని అధికారులకు సూచించారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. రాతి కట్టడాలతోనే నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించానని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా సమ్మక్క-సారలమ్మ ఆలయం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములయిన వారి జన్మ చరితార్థం కాబోతోందని అన్నారు. ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిదని కొనియాడారు. ఆదాయం ఆశించి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టొదని.. అంతా భక్తితో పని చేయాలన్నారు. ఆదివాసీ పోరాట చరిత్రను, స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించేలా నిర్మాణం ఉండాలన్నారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా సాగునీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనచోట చెక్ డ్యాంలు నిర్మించాలని, రాబోయే 100 రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్టతో పనిచేయాలన్నారు. నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. పనులు పూర్తి చేయించుకునే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక డెడికేటెడ్ టీమ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Next Story