భైంసాలో మహిళ దారుణ హత్య..! చంపేసి మృతదేహం పక్కన్నే..

by Bhanu |   (  Updated:2025-12-08 11:21:57  IST  )

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సంతోషిమత ఆలయ సమీపంలో గల నందన టీ పాయింట్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు.

భైంసాలో మహిళ దారుణ హత్య..! చంపేసి మృతదేహం పక్కన్నే..
X

దిశ, భైంసా: అక్రమ సంబంధం నేపథ్యంలో టీ స్టాల్ నడుపుకుంటున్న మహిళ దారుణ హత్యకు గురైంది. తనతో ఉంటూనే మరో వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడుతుందనే అనుమానంతో ఆమె ప్రియుడు టీ స్టాల్‌లో మహిళను కత్తితో పొడిచి, రాడ్డుతో దాడి చేసి హతమర్చాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

భైంసా మండలం కుంసర గ్రామానికి చెందిన అశ్విని(30)కి వివాహం అయ్యి, మనస్పర్థాల కారణంగా విడాకులు తీసుకుంది. ఒంటరిగా ఉంటున్న ఆమెకు భైంసా పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇప్పరే నగేష్‌తో పరిచయం ఏర్పడి, అది అక్రమ సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. దీంతో అశ్విని జీవనోపాధి కోసం భైంసా పట్టణంలోని సంతోషిమాత ఆలయం పక్కన నగేష్ టీ పాయింట్ పెట్టించాడు. ఈ క్రమంలో అశ్విని మరో వ్యక్తితో తరచూ ఫోన్ మాట్లాడమే కాకుండా, నిత్యం చాటింగ్ చేస్తుందని నరేష్ అనుమానించాడు. దీనిపై ఆమెను హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో ఈ రోజు(సోమవారం) ఉదయం టీ స్టాల్‌లో ఉన్న ఆమెను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అశ్విని రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

అయితే ప్రియురాలిని హత్య చేసిన నగేష్ ఎక్కడికి పారిపోకుండా ఆమె మృతదేహం పక్కన్నే కూర్చున్నాడు. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన బైంసా పోలీసులు నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, హత్యకు దారి తీసిన సంఘటనపై పోలీసులు నగేష్‌తోపాటు స్థానికులను విచారిస్తున్నారు.

Next Story