ఆదిలాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు.

ఆదిలాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: జిల్లా కలెక్టర్
X

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, ప్రజలకు అవసరమైన మేర నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రుతో కలిసి చమురు కంపెనీల సేల్స్ అధికారులు, బంక్ డీలర్లు, సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పెట్రోల్, డీజిల్ ఇంధన సరఫరా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రవాణా ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద ఇంధన లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు.

అదేవిధంగా బ్లాక్ మార్కెటింగ్ లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి నిల్వలను దాచిపెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడితే, వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను లేదా పుకార్లను నమ్మి ప్రజలు భయాందోళనకు గురై బంకుల వద్ద రద్దీ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చమురు కంపెనీ ప్రతినిధులతో నిర్వహించిన గూగుల్ మీట్‌లో, డిపోల నుండి బంకులకు చేరుతున్న సరఫరా తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నందిని, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు, జిల్లా పెట్రోల్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Next Story