ఆదిలాబాద్ ఆలయంలో అద్భుతఘట్టం ఆవిష్కృతం.. తన్మయత్వం చెందిన భక్తులు

by Naga Rani Yarlagadda |

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ఆలయంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. లక్ష్మీనారాయణుడి పాదాలను సూర్యకిరణాలు తాకాయి.

ఆదిలాబాద్ ఆలయంలో అద్భుతఘట్టం ఆవిష్కృతం.. తన్మయత్వం చెందిన భక్తులు
X

దిశ, వెబ్ డెస్క్: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ ఆలయంలో అద్భుతఘట్టం ఆవిష్కృతమైంది. జైనథ్ మండలకేంద్రంలో అతిప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిచెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం ఉదయం ఈ ఘట్టం కనువిందు చేసింది. స్వామివారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా తాకాయి. ఈ విషయం తెలిసి.. ఆ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు చుట్టుపక్కల భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి పాదాలు, కిరీటంపై సూర్యకిరణాలు పడగా.. ఆ కిరణకాంతుల్లో స్వాములోరి రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

పల్లవుల కాలంనాటి ఆలయం

హైదరాబాద్ నుంచి సుమారు 324 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా సంపదను కలిగి ఉంది. ఆలయం జైన సంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్లే ఆ ఊరికి జైనథ్ అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెప్తోంది. 60 గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో అష్ఠకోణాకార మండపంతో నల్లరాతితో ఆలయాన్ని నిర్మించారు. లక్ష్మీనరసింహస్వామి మూలవిరాట్టుతోపాటు.. లక్ష్మీదేవి, అనంతపద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గధాదరుడు, హక్ష్మీగ్రీవుడు, గరుత్మంతుడు కొలువై ఉంటారు. సంతానం లేనివారు స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉంది. అందుకే సంతాన నారాయణుడిగా కూడా ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. కాగా.. ఆలయం గోడలపై చెక్కిన శ్లోకాలు, శిలాశాసనాలను బట్టి చూస్తే పల్లవ సామ్రాజ్యంలో నిర్మించిన ఆలయమని తెలుస్తుంది. ప్రతిఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, దసరా తర్వాత వచ్చే ఆశ్వీయుజ పౌర్ణమి నాడు లక్ష్మీనారాయణుని పాదాలను సూర్యకిరణాలు తాకుతాయి. అందుకే స్థానికులు లక్ష్మీ సూర్యనారాయణుడిగా కూడా పిలుచుకుంటారు.

Next Story