సంక్షేమ పథకాలకు అడ్డాగా తెలంగాణ : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

by Disha Web Desk 1 |
సంక్షేమ పథకాలకు అడ్డాగా తెలంగాణ : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
X

దిశ, బోథ్: సంక్షేమ పథకాలకు అడ్డాగా తెలంగాణ వెలిగిపోతోందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మంగళవారం బోథ్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పదవులను త్యజించాడని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలను అస్త్రాలుగా చేసుకుని నేటి సీఎం కేసీఆర్ ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారని తెలిపారు.

14 ఏళ్లు అలుపెరుగని పోరాటం చేసి, 11 రోజులు ఆమరణ నిరాహర దీక్షతో ఉద్యమ బావుటా సీఎం కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభను ఏర్పాటు చేసి అన్ని మండలాలు, గ్రామాలు, తాండల నుంచి గులాబీ సైనికులు భారీ ఎత్తున తరలివచ్చినందుకు కతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం రావాలనే ఉద్దేశ్యంతో తాను ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లుగా ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అని, రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, కన్వీనర్ నారాయణ రెడ్డి, జడ్పీటీసీ సంధ్య రాణి, మార్కెట్ చైర్మన్ రుక్మన్ సింగ్, అధికార ప్రతినిధి కిరణ్, కోఆప్షన్ సభ్యుడు తహెర్ బిన్, ఎలక రాజు, రమణ గౌడ్, సోలంకి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story

Most Viewed