పోడు గోడు తీరేనా...!

by Disha Web Desk 20 |
పోడు గోడు తీరేనా...!
X

దిశ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వేమనపల్లి, దండేపల్లి మండలాల్లోని పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఈసారైనా యాజమాన్య హక్కులు కల్పించేందిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అటవీ ప్రాంత పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి నుంచి గతంలో దరఖాస్తులను స్వీకరించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో అటవీ అధికారులు పోడు భూములపై గ్రామ స్థాయిలో కమిటీలు వేసి సంయుక్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారు.

వేమనపల్లి మండలంలోని పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికీ అటవీ హక్కులు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దాల కాలం నుండి అటవీ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు భూములపై యజమాన్య హక్కులు వస్తే వారికి రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు, ఇతర సబ్సిడీలను పొందే అవకాశం ఉంటుందంటున్నారు.

ప్రభుత్వం ఈసారి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరికీ హక్కు పత్రాలను ఇస్తుందనే ఆశలు రైతులలో చిగురుస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006 లో ఆర్ఓఎఫ్ఆర్ కింద గిరిజనులకు మాత్రమే అటవీ హక్కు పత్రాలను ఇచ్చారు. దశాబ్దాల కాలం నుండి అటవీ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులు ఈ సారైనా పోడు రైతులకు భూ యజమాన్య హక్కులు వస్తాయని ఎదురుచూస్తున్నారు.

నిరంతరం అటవీ అధికారులకు, పోడు భూములు సాగు చేసుకున్న రైతులకు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. సెక్షన్ 4 లోని 6వ నిబంధన ప్రకారం అటవీ భూమిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పది ఎకరాలలోపు యాజమాన్య హక్కులు కల్పించాల్సి ఉంది. ఇప్పటికైనా పోడు రైతుల నిరీక్షణకు తెరపాడాలని, యాజమాన్య హక్కులను కల్పించాలని రైతులను కోరుకుంటున్నారు.


Next Story

Most Viewed