మా ఊరికి గుడి కట్టిస్తున్నాడు.. మీరు వివాదం చేయొద్దు..?

by Disha Web Desk 20 |
మా ఊరికి గుడి కట్టిస్తున్నాడు.. మీరు వివాదం చేయొద్దు..?
X

దిశ, మందమర్రి : గత కొంతకాలంగా మందమర్రి మండలంలోని సారంగపల్లి ఊర చెరువులో మట్టి (మొరం) అక్రమ తవ్వకాలు యదేచ్చగా సాగుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు తెలిసినప్పటికీ వీరు అటువైపు వెళ్లకపోవడం పై పలు అనుమానాలకు తావునీస్తోంది. సారంగపల్లి గ్రామపంచాయతీ ఊర చెరువు నుండి శంకరపల్లి మట్టి ఇటుకల తయారీ వ్యాపారులు తమ స్థావరానికి మట్టి తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనిదినాలలో మట్టి (మోరం) అక్రమ తరలింపునకు ఆటంకం కలుగుతుందని భావించిన ఆక్రమదారులు ప్రభుత్వ సెలవు దినాలు, రాత్రి నుండి తెల్లవారుజాముదాకా వందల ట్రాక్టర్లతో మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

ఈ అక్రమ వ్యాపారంలో ప్రజా ప్రతినిధులు కీలక భూమికను పోషిస్తుండడం గమనార్హం. మా ఊరికి గుడి కట్టిస్తున్నాడు ఇక్కడ మీరు వివాదం చెయ్యొద్దని ప్రశ్నించిన వారికి హెచ్చరికలు జారీ చేయడం పలువురికి మింగుడు పడడం లేదని సమాచారం.

పంపకాలకు అంత సిద్ధం..?

ఊరు చెరువు నుండి మట్టిని తరలించుకు వెళ్ళినందుకు నజరానాగా గ్రామానికి గుడి కట్టిస్తానని ఇటుకల వ్యాపారి పంచాయతీ పాలకులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా వార్డు సభ్యులు, కుల పెద్ద మనుషులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు నగదు బేరాలు కుదిరినట్టు ప్రచారం సాగుతుంది.



Next Story

Most Viewed