నిషేధిత నొప్పి నివారణ టాబ్లెట్లను మత్తు పదార్థంగా మార్చి సిరంజీల విక్రయాలు

by Taduka Kalyani |

నిషేధిత టాపెంటాడాల్ నొప్పి నివారణ మాత్రలను మత్తు పదార్థంగా వినియోగిస్తూ, అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలో ముగ్గురిని పట్టుకున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు.

నిషేధిత నొప్పి నివారణ టాబ్లెట్లను మత్తు పదార్థంగా మార్చి సిరంజీల విక్రయాలు
X

దిశ, ఉట్నూర్ : నిషేధిత టాపెంటాడాల్ నొప్పి నివారణ మాత్రలను మత్తు పదార్థంగా వినియోగిస్తూ, అక్రమంగా విక్రయిస్తున్న ముఠాలో ముగ్గురిని పట్టుకున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉట్నూర్ పట్టణంలోని కొమురం భీమ్ కాంప్లెక్స్ సమీపంలో గురువారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితులు నిషేధిత టాపెంటాడాల్ మాత్రలను సిరంజీల ద్వారా మత్తు కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. దర్యాప్తులో ఎలాంటి సరైన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్ట్ కదం అలియాస్ కదం శేఖర్ అక్రమంగా టాపెంటాడాల్ మాత్రలను విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. చౌహాన్ నిఖిల్ రాజ్, పొడేటి వంశీ కృష్ణలతో పాటు మరో ఇద్దరు నిందితులు కలిసి వాటిని తెలిసి కొనుగోలు చేసి మత్తు కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఈ కేసులో చౌహాన్ నిఖిల్ రాజ్, పొడేటి వంశీ కృష్ణ, కదం శేఖర్లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు స్ట్రిప్స్ నిషేధిత టాపెంటాడాల్ టాబ్లెట్లు, రెండు సిరంజీలు, ఆపిల్ మొబైల్ ఫోన్, వివో మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కి తరలించామని, పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్,ఎస్ఐ విజయ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

Next Story