కాంగ్రెస్ తో అధోగతి.. బీజేపీతో విధ్వంసం..మంత్రి కేటీఆర్

by Disha Web Desk 20 |
కాంగ్రెస్ తో అధోగతి.. బీజేపీతో విధ్వంసం..మంత్రి కేటీఆర్
X

దిశ, బెల్లంపల్లి : దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా 55 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పీకిందేంలేదని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బెల్లంపల్లి ఏఎంసీ గ్రౌండ్ లో సోమవారం పట్టాల పంపిణీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తామన్న రేవంత్ రెడ్డి మాటలపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సామాన్యుల జీవితాలను నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని ఆయన నిలదీశారు. సింగరేణిని బొంద పెట్టింది చాలదా అని అన్నారు. దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన కాంగ్రెస్ పాలన మళ్లీ అవసరమా అని ప్రజలు ఆలోచించాలన్నారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తే బీజేపీ విధ్వంసం చేసిందన్నారు.

సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోడీ ఎందుకు ఇవ్వలేదని ప్రజలకు జవాబు చెప్పాలని నిలదీశారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం ఎందుకు పోలేదని ప్రశ్నించారు. రైతుల ఆదాయం పెంచుతానంద ప్రధానమంత్రి మోడీ రైతుల ఆదాయం పెరిగిందా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం కోసం ఆయన పనిచేస్తలేడా అని తన దోస్తు ఆదాని ఆదాయం పెంచడం కోసమే పాలిస్తున్నాడని విమర్శించారు. దేశంలో నల్లధనాన్ని ఇస్తామన్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ తెల్ల మొఖం వేశాడని ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీకి నీతి ధర్మం లేదని మండిపడ్డారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బావులను ఇప్పటికే అమ్మి వేశాడని విమర్శించారు. దేశం బాగుపడింది లేదని ఆదాని, అంబానీలే బాగుపడ్డారని విమర్శించారు.

అభివృద్ధి పథంలో బెల్లంపల్లి ముందు బాటలో ఉందని అన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభివృద్ధిలో దూసుకెళ్తున్నాడని కొనియాడారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచి పనులు చేస్తున్నాడని అభినందించారు. బెల్లంపల్లి అభివృద్ధికి రూపాయలు 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా ఐటీరంగంలో బెల్లంపల్లి అడుగుపెట్టిందని అన్నారు. నైపుణ్యత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. మంచి నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందామని అన్నారు. ఎలక్షన్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఆగం కావద్దని కోరారు.

సీఎం కేసీఆర్ మూడోసారి గెలిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుంటుందన్నారు. బెల్లంపల్లిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచి పనులు చేస్తున్నా అన్నారు. 7 వేల పట్టాలు సాధించేవరకు నిద్రపోలేదా అన్నారు. రూ.2000 కోట్లతో దేవపూరు కంపెనీని విస్తరింప చేయడానికి శంకుస్థాపన చేసుకున్నామన్నారు. కంపెనీ విస్తరణతో వేలమందికి ఉద్యోగాలు వస్తాయని, ఈ ఘనత ఎమ్మెల్యే చిన్నయ్యదని మంత్రి ప్రశంసలు కురిపించారు. మనిషి చిన్నోడేగాని అభివృద్ధి పనుల్లో పెద్దోడని ఎమ్మెల్యే చిన్నాయన ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలని అందజేశారు. సమావేశంలో హోం మినిస్టర్ మహమ్మద్ అలీ, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పులఈశ్వర్, ప్రభుత్వ విప్పు బాల్క సుమన్, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, కోనప్ప, అత్రం సక్కు, రేఖ నాయక్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతర పాల్గొన్నారు.



Next Story

Most Viewed