పైప్‌లైన్ విస్తరణలో ఇష్టారాజ్యం.. పొంచి ఉన్న ప్రమాదాలు

by Disha Web Desk 12 |
పైప్‌లైన్ విస్తరణలో ఇష్టారాజ్యం.. పొంచి ఉన్న ప్రమాదాలు
X

దిశ, మంచిర్యాల : పిల్లి గుడ్డిదైతే ఎలుక ఆడిందే ఆట.. అనే సామెత చందంగా తయారైంది మిషన్ భగీరథ అధికారుల పని తీరు. గుంతలు తవ్వి పైప్ లైన్ విస్తరణ పనులు చేసిన కాంట్రాక్టర్లు సరైన పర్యవేక్షణ లేని సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని పూడ్చడంలో తాత్సార్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామ సమీపాన బుగ్గ గట్టు మిషన్ భగీరథ గ్రిడ్ ప్రధాన పైప్ లైన్ విషయంలో ఈ సమస్య నెలకొంది. జాతీయ రహదారి పక్క నుంచే ఉన్న ఈ పైప్ లైన్ గుంతల్లో ఏవేని వాహనాలు అదుపుతప్పి అటువైపుగా దూసుకు వెళితే పెద్ద ప్రాణనష్టమే జరిగే అవకాశం ఉందని వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ విషయం..

ఐదేళ్ల క్రితం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడి పేట గ్రామ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద భగీరథ పథకం ఫిల్టర్ గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో రాపల్లి గ్రామ సమీపాన బుగ్గ గట్టు గుట్ట వద్ద గ్రిడ్ స్టోరేజ్ ట్యాంక్‌ను నిర్మించారు. ప్రాజెక్టు వద్ద ఫిల్టర్ బెడ్ నుంచి గుడి పేట మీదుగా 63వ. నెంబరు జాతీయ రహదారి పక్క నుంచి ఎమ్మెస్ పైప్ లైన్ కోసం గుంతలు తవ్వారు. అయితే పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్లు వాటి మీదుగా మట్టిని పోసి గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. అయితే పైప్ లైన్ వేసిన తర్వాత అక్కడక్కడ గుంతలు పుడ్చకుండా అలాగే వదిలేశారు. బుగ్గ గట్టు వద్ద భగీరథ గ్రిడ్ స్టోరేజీ ట్యాంక్ నుంచి మంచిర్యాల‌కే కాకుండా చెన్నూరు, మందమర్రి, లక్షెట్టిపేట దండేపల్లి మండలం వరకు భగీరథ నీరు సరఫరా అవుతుంది.

నిత్యం గుడిపేట, రాపల్లి వద్ద ఈ రహదారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు చేస్తుంటాయి. గుడిపేట వద్ద రహదారి పొడవునా పక్కనే పైప్ లైన్ వేసి గుంతలు పూడ్చకపోవడంతో అదుపుతప్పి వాహనదారులు వాటిలో పడితే తీవ్ర గాయాలు కావడమే కాకుండా ప్రాణాపాయం కూడా లేకపోలేదని వాహనదారులు అంటున్నారు. ఒక వేళ లోడ్ తో ఉన్న భారీ వాహనాలు పైప్ లైన్ గుంతల పైపు దూసుకెళ్లి పైపులను ఢీకొంటే ఆ పైపులకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పైప్ లైన్ డ్యామేజ్‌తో మంనీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పైప్ లైన్ గుంతలను పూడ్పించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై మంచిర్యాల మిషన్ భగీరథ ఏఈ అరుణ్ ను ‘దిశ’ సంప్రదించగా రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గుంతలు తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం.

Next Story

Most Viewed